Indian Railway New Digital Ticket Rule: చాలా మంది రైలు ప్రయాణం చేసే సమయంలో టీసీకి డిజిటల్ టికెట్ చూపిస్తారు. టికెట్ స్క్రీన్ షాట్, వాట్సాప్ లో వచ్చిన కాపీని చూపించి జర్నీ చేస్తారు. కానీ, ఇకపై అలా చేయడం కుదరదు అంటుంది భారతీయ రైల్వే. అంతేకాదు, తాజాగా డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్లకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై డిజిటల్ టికెట్స్ తో రైలు ఎక్కితే జరిమానా తప్పదని హెచ్చరించింది.
రైల్వే తాజా గైడ్ లైన్స్ ప్రకారం రైల్ వన్ యాప్ లో కనిపించే ఒరిజినల్ డిజిటల్ టికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. టికెట్ స్క్రీన్ షాట్, ఫోటో, PDF కాపీ, వాట్సాప్ లో ఫార్వార్డ్ చేసిన టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తేల్చి చెప్పింది. అంటే, టికెట్ బుక్ చేసిన అదే మొబైల్ ఫోన్లో, అదే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో రైల్ వన్ యాప్ లో టికెట్ తప్పనిసరిగా ఉండాలి. టికెట్ చెక్ చేసే సమయంలో TTE అడిగితే యాప్ లోనే అసలు టికెట్ చూపించాల్సి ఉంటుంది.
రైల్వే తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన వెనుక ఓ కారణం ఉంది. ఇటీవల కోర్బా-విశాఖపట్నం లింక్ ఎక్స్ ప్రెస్ రైలు లో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన టికెట్ స్క్రీన్ షాట్ ను వాట్సాప్ ద్వారా చూపించింది. విచారణలో ఆ టికెట్ ఆమె మొబైల్ లో కాకుండా మరో వ్యక్తి ఫోన్ లో బుక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, టికెట్ రైలు బయలుదేరిన తర్వాత బుక్ చేసినట్లు తేలింది. దీంతో ఆ టికెట్ చెల్లదని చెప్పి, ప్రయాణికురాలికి జరిమానా విధించారు. ఈ ఘటన తర్వాత రైల్వే ప్రయాణికులకు స్పష్టమైన సూచనలు చేసింది. డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్తో ప్రయాణించాలంటే, రైలు బయలుదేరే ముందు టికెట్ బుక్ చేసుకోవాలి. రైలు స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత బుక్ చేసిన టికెట్ చెల్లుబాటు కాదు. అలాగే, టికెట్ ఉన్న మొబైల్ ఫోన్ ప్రయాణం మొత్తం సదరు ప్యాసింజర్ దగ్గరే ఉండాలి.
ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ కు తగినంత బ్యాటరీ ఉండేలా చూసుకోవాలని కూడా అధికారులు సూచించారు. టికెట్ లో స్టేషన్ పేరు, ప్రయాణ తేదీ లాంటి వివరాలను ముందుగానే పరిశీలించడం మంచిదని తెలిపారు. కేవలం స్క్రీన్ షాట్, ఫార్వార్డ్ చేసిన టికెట్ తో రైల్లో ప్రయాణిస్తే, జరిమానా పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ నిబంధనలు రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసిన అన్రిజర్వ్డ్ డిజిటల్ టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ రిజర్వేషన్ టికెట్లపై ఈ మార్పులు ఉండవు. రిజర్వేషన్ టికెట్ల విషయంలో అప్పటికే గుర్తింపు కార్డు ద్వారా కన్ఫార్మేషన్ జరుగుతున్నందున వాటికి ఈ కొత్త నిబంధనలు వర్తించవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సో, రైలు ప్రయాణానికి ముందు ఈ నిబంధనలను తెలుసుకుని జాగ్రత్తగా టికెట్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.
Read Also: మీకు తెలుసా? భారతీయ రైల్వేలో ఒక రోజు ప్రయాణించే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానం!