AC Room: ప్రస్తుత వేసవి నేపథ్యంలో చాలా మంది ఎండలోనుంచి రాగానే నేరుగా ఏసీ గదిలోకి వెళ్లిపోతుంటారు. వెంటనే ఏసీని ఆన్ చేసి.. దాని నుంచి వచ్చే చల్లదనంతో సేద తీరేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా నేరుగా అధిక ఉష్ణోగ్రత నుంచి వెంటనే చల్లదనం లోకి మారడం మంచిదేనా? దీనిపై వైద్యులు ఏం చెబుతున్నారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వైద్యుల నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎండలో నుంచి వచ్చిన వెంటనే ఏసీ గదిలోకి వెళ్లడం అస్సలు మంచిది కాదు. బయట ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు.. మన శరీరం ఆ వేడికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. అలాంటప్పుడు ఒక్కసారిగా 20 లేదా 22 డిగ్రీల సెల్సియస్ ఉండే ఏసీ గదిలోకి వెళ్తే శరీరం ఆ అకస్మాత్తు ఉష్ణోగ్రత మార్పును (Thermal Shock) తట్టుకోలేదు.
సాధారణంగా ఎండలో ఉన్నప్పుడు మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి (Dilate). శరీరం చెమట ద్వారా వేడిని బయటకు పంపి చల్లబడటానికి ప్రయత్నిస్తుంది. అయితే అకస్మాత్తుగా ఏసీ గదిలోకి మారినప్పుడు రక్తనాళాలు హఠాత్తుగా కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తపోటు (Blood Pressure)లో హెచ్చుతగ్గులు రావొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చల్లటి గాలి ఒక్కసారిగా తగలడం వల్ల కండరాలు పట్టేయడం లేదా నొప్పులు రావడం కూడా జరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ ఉష్ణోగ్రత మార్పుల వల్ల రోగనిరోధక శక్తి తాత్కాలికంగా బలహీనపడి.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండె జబ్బులు, బీపీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎండ నుంచి నేరుగా ఏసీ గదిలోకి వెళ్లే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల గుండెపై అదనపు భారం పడుతుందని పేర్కొంటున్నారు. ఇది కొన్నిసార్లు గుండెపోటు (Heart Attack) లేదా పక్షవాతం (Stroke) వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ట్రంప్ మరో సంచలనం.. గ్రీన్ కార్డ్ రూల్స్ మార్పు.. అమెరికాలో ఉంటే నో ఛాన్స్!
ఎండలోంచి వచ్చిన తర్వాత కొన్ని సాధారణ నియమాలు పాటించడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వాటి ప్రకారం.. బయట నుంచి రాగానే ఫ్యాన్ కింద లేదా సాధారణ ఉష్ణోగ్రత ఉన్న గదిలో కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు కూర్చోవాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చే వరకు ఆగాలి. ఒంటిపై ఉన్న చెమట పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఏసీ ఆన్ చేయడం లేదంటే ఏసీ గదిలోకి వెళ్లడం చేయాలి. మరోవైపు ఎండలోంచి రాగానే ఫ్రిడ్జ్ నీరు తాగడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. రూమ్ టంపరేచర్ లో ఉన్న సాధారణ నీటిని తాగడం సురక్షితమని పేర్కొంటున్నారు.
Also Read: కిరాణా స్టోర్కు వెళ్లిన.. 10 ఏళ్ల బాలిక దారుణ హత్య.. సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!