Jaipur’s Cool Roof Formula: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం ఏసీలు ఆన్ చేస్తుంటే నెలాఖరు వచ్చేసరికి విద్యుత్ బిల్లు తడిచి మోపెడు అవుతోందని చాలా మంది వాపోతున్నారు. ఈ సమస్యకు రాజస్థాన్ రాజధాని జైపూర్ వాసులు అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం 4,000 పైగా ఇళ్లు ఎలాంటి ఏసీలు లేకుండానే ప్రస్తుతం చల్లగా ఉంటున్నాయి. ఆ సక్సెస్ స్టోరీ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
జైపూర్కు చెందిన ఒక సామాజిక సంస్థ.. స్థానిక ప్రజల సహకారంతో ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం వారు ఎంచుకున్న మార్గం ‘సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్’ లేదా ‘వైట్ రూఫింగ్’. ఇళ్ల టెర్రస్లపై ప్రత్యేకమైన తెల్లటి సున్నం లేదా రిఫ్లెక్టివ్ పెయింట్ను పూయడం ద్వారా.. ఇంటిలోపలి వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లగా మార్చేస్తున్నారు. సాధారణంగా సిమెంట్ కాంక్రీట్ రూఫ్స్.. సూర్యరశ్మిని పీల్చుకుని ఇళ్లను వేడిక్కిస్తాయి. కానీ, ఈ తెల్లటి కోటింగ్ సూర్యకిరణాలను దాదాపు 80% నుంచి 90% వరకు తిరిగి ఆకాశంలోకి పరావర్తనం చేస్తాయని స్థానిక ప్రజలు, నిపుణులు చెబుతున్నారు.
ఈ చిన్న మార్పు వల్ల తమ ఇళ్లల్లో అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయని జైపూర్ వాసులు చెబుతున్నారు. సాధారణ ఇళ్లతో పోలిస్తే.. ఈ వైట్ రూఫ్ ఇళ్లలో ఇండోర్ ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిందని పేర్కొంటున్నారు. ఇళ్లు సహజంగానే చల్లబడటంతో కూలర్లు, ఫ్యాన్ల వాడకం తగ్గిందని.. ఫలితంగా నెలవారీ విద్యుత్ బిల్లులు భారీగా ఆదా అవతున్నాయని జైపూర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏసీల వాడకం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని పేర్కొంటున్నారు.
జైపూర్ లోని మరికొన్ని కుటుంబాలు.. మరో అడుగు ముందుకేసి.. వైట్ పెయింటింగ్ తో పాటు టెర్రస్ పై మెుక్కలు పెంచుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో ఆ మెుక్కలకు నీరు పోస్తూ.. టెర్రస్ ను చల్లదనంతో నింపేస్తున్నాయి. దీని వల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత సగటున 5-8 డిగ్రీల వరకూ తగ్గుతోందని స్థానికులు చెబుతున్నారు. టెర్రస్ ను తోటలుగా మార్చే ఈ ప్రక్రియ వల్ల.. ఇంటిలోపల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పాన్ కార్డు నెంబర్లు.. చిత్ర విచిత్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఇంత కథ ఉందా?
రూ. వేలకు వేలు ఖర్చు పెట్టి ఏసీలు కొనలేని మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఈ ‘రూఫ్ కూలింగ్’ పద్ధతులు ఒక వరంగా మారుతాయని నిపుణులు అంటున్నారు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఐడియా.. ఇప్పుడు జైపూర్ అంతటా విస్తరిస్తోందని అక్కడి వారు పేర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, గ్లోబల్ వార్మింగ్కు ఇలాంటి సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇలాంటి పరిష్కారాలు ఎంతో అవసరమని పర్యావరణ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో.. ఈ జైపూర్ మోడల్ను ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తే.. మంచి ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: స్మార్ట్ వాషింగ్ మెషీన్ కొంటున్నారా? 20 ఏళ్ల మోటార్ వారంటీతో పవర్ఫుల్ మోడల్స్