Best Indian Destinations 2026: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయులను అవసరం లేని విదేశీ పర్యటనలను సంవత్సరం పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. విదేశాల్లో పెళ్లిళ్లు, సెలవులు, లగ్జరీ ట్రిప్స్ పై ఖర్చు చేసే బదులు దేశీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వాలన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయులలో విదేశీ టూర్లపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా థాయ్ లాండ్, బాలి, మాల్దీవులు, స్విట్జర్లాండ్, వియత్నాం, దుబాయ్ లాంటి ప్రదేశాలు భారతీయ పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్స్ గా మారాయి. అయితే, ఇప్పుడు అలాంటి ఎక్స్ పీరియెన్స్ కోసం మన దేశంలోనే బోలెడు అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.
ఫూకెట్ కు బదులుగా ఉత్తర గోవాకు వెళ్లొచ్చు. బీచ్ లు, నైట్ లైఫ్, ఫుడ్ కల్చర్ పరంగా గోవా మంచి ప్రత్యామ్నాయంగా మరాంది. థాయ్లాండ్, బాలి వంటి బీచ్ డెస్టినేషన్స్ కు బదులుగా కేరళ, గోకర్ణ, అండమాన్, నికోబార్ దీవులు లాంటి ప్రదేశాలు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి.
మాల్దీవులకు వెళ్లాలనుకునే వారికి లక్షద్వీప్ మంచి ఆల్టర్నేటివ్ గా మారుతోంది. తెల్లని ఇసుక తీరాలు, నీలిరంగు సముద్ర జలాలు, ప్రశాంతమైన ద్వీప వాతావరణం మాల్దీవులను గుర్తు చేస్తుంది. అలాగే, అండమాన్ దీవులు కూడా స్కూబా డైవింగ్, బీచ్ రిసార్ట్స్ తో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
స్విట్జర్లాండ్ లో కనిపించే మంచు కొండలు, ప్రకృతి అందాలను మన దేశంలో కూడా చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలు వేసవిలో కూడా చల్లటి వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే, యూకే తరహా కాలనీ అందాలు కావాలనుకుంటే సిమ్లా, ముస్సోరీ, డార్జిలింగ్ లాంటిహిల్ స్టేషన్లు మంచి ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు.
ఇక సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్ లాంటి మోడ్రన్ నగరాల అనుభూతి ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను ఎంచుకోవచ్చు. ఇవి కూడా ఇప్పుడు అంతే స్థాయిలో అభివృద్ధి చెందాయి. షాపింగ్, ఫుడ్, నైట్ లైఫ్, లగ్జరీ హోటల్స్ పరంగా అంతర్జాతీయ నగరాలకు పోటీ పడుతున్నాయి.
కోవిడ్ తర్వాత భారతీయులు దేశీయ టూరిజం వైపు ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత హిల్ స్టేషన్లు, రోడ్ ట్రిప్స్, వెల్నెస్ టూరిజం భారీగా పెరిగాయి. ఇప్పుడు పశ్చిమ ఆసియా సంక్షోభం, పెరుగుతున్న విమాన ఛార్జీలు, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా మరోసారి దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ట్రావెల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత్ లోనే ప్రపంచ స్థాయి అనుభవాలతో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. విదేశీ ట్రిప్స్ కు ఖర్చు చేసే బదులు, దేశంలోని ప్రకృతి అందాలు, సంస్కృతి, వారసత్వ ప్రాంతాలను అన్వేషించడం చాలా మంది మొదలుపెట్టారు.
Read Also: మండే ఎండలతో అల్లాడుతున్నారా? కూల్ గా అలా హిమాలయాలను చుట్టేసి రండి!