Japan’s Smart Idea: మన రోజువారీ జీవితంలో నడక అనేది సాధారణ విషయం. కానీ, అదే నడకను కరెంటుగా మార్చితే ఎలా ఉంటుంది? విద్యుత్ కు కొరత అనేదే ఉండదు. జపాన్లో ప్రస్తుతం ఇదే ఆలోచన వాస్తవరూపం దాల్చుతోంది. పీజోఎలెక్ట్రిక్ అనే ప్రత్యేక టెక్నాలజీ ద్వారా, మనం వేసే ప్రతి అడుగులోని ఒత్తిడిని విద్యుత్తుగా మార్చే విధానం అమలు చేస్తున్నారు.
సాధారణంగా ఇప్పటి వరకు జల విద్యుత్, థర్మర్ పవర్, విండ్ పవర్, సోలార్ పవర్ ను తయారు చేయడం చూశాం. కానీ, జపాన్ చాలా డిఫరెంట్ ఆలోచన చేసింది. ఏకంగా మనుషుల నడక నుంచి విద్యుత్ తయారు చేసే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ విధానంతో పెద్ద స్థాయిలో కాకపోయినా, చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడే కరెంటును తయారు చేయాలని భావిస్తోంది.
పీజోఎలెక్ట్రిసిటీ ద్వారా నడకతో విద్యుత్ తయారు చేస్తుంది. పీజోఎలెక్ట్రిసిటీ అంటే, కొన్ని ప్రత్యేక పదార్థాలపై ఒత్తిడి పడినప్పుడు అవి కొద్ది మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ సూత్రాన్ని ఉపయోగించి, నేల మీద ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటు చేస్తాయి. ప్రజలు వాటి మీదుగా నడిచినప్పుడు, వారి అడుగుల ఒత్తిడి ఈ సెన్సార్లపై పడుతుంది. అప్పుడు ఆ ఒత్తిడి విద్యుత్తుగా మారుతుంది. ఇది చిన్న మొత్తంలోనే అయినా, నిల్వ చేసి, లేదంటే వెంటనే ఉపయోగించుకునే అవకాశం ఉంది.
పీజోఎలెక్ట్రిసిటీ విధానాన్ని జపాన్లోని రద్దీ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. టోక్యోలోని షిబుయా స్టేషన్ లాంటి ప్రదేశాల్లో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తారు. ఇలాంటి ప్రదేశాల్లో ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫ్లోరింగ్ ద్వారా ప్రయాణికుల అడుగుల నుంచి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ విద్యుత్తును LED లైట్లు, డిస్ ప్లే బోర్డులు లాంటి తక్కువ కరెంటు అవసరమయ్యే పరికరాలకు ఉపయోగిస్తున్నారు. ఇది స్టేషన్ మొత్తానికి అవసరమైన విద్యుత్ తయారు చేయకపోయినా, చిన్న అవసరాలకు మాత్రం సాయపడుతుంది. ఈ విధానం, పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. పైగా, మనుషుల కదలికను ఉపయోగించుకుంటుంది కాబట్టి ప్రత్యేక ఇంధనం అవసరం ఉండదు.
రైల్వే స్టేషన్లతో పాటు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు సహా పలు రద్దీ ప్రదేశాల్లో కూడా ఈ టెక్నాలజీని పరీక్షిస్తున్నారు. ఒకసారి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తే, అది ఆటోమేటిక్ గా పని చేస్తుంది. అయితే, ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక్క అడుగు నుంచి వచ్చే విద్యుత్తు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శక్తి పొందాలంటే ఎక్కువ మంది ఒకే ప్రదేశంలో నడవాలి. అలాగే, దీన్ని ఇన్ స్టాల్ చేయడానికి ఖర్చు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ భవిష్యత్తులో పట్టణాలు మరింత స్మార్ట్ గా మారే దిశగా ఇదో మంచి అడుగుగా భావించవచ్చు.
Read Also: భూగర్భంలో గ్రామాలు, ప్రపంచంలో ఇదో వండర్!