Summer Cooling Tips: రోజు రోజుకీ ఎండలు ముదిరిపోతున్న ఈ తరుణంలో.. ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ చల్లగా ఉండే బ్రిటన్ వంటి దేశాల్లో సైతం ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీల మార్కును తాకుతున్నాయి. అక్కడి వాతావరణ శాఖ హీట్ అలర్ట్ జారీ చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా అక్కడి ఇళ్లు చలిని తట్టుకుని, వేడిని లోపలే ఉంచుకునేలా కడతారు. అందుకే ఇప్పుడు ఈ అసాధారణ ఎండలకు ఇళ్లన్నీ సెగలు గక్కుతున్నాయి. మనలాగే అక్కడ కూడా ఏసీలు వాడదామంటే కరెంట్ బిల్లుల మోత, ఫ్యాన్లు వేసినా వేడి గాలే వస్తోంది. ఇలాంటి సమయంలో భారీగా ఖర్చు పెట్టకుండా, ఇంట్లోని వేడిని తగ్గించడానికి అక్కడి ప్రజలు ఒక చవకైన, వినూత్నమైన మార్గాన్ని వెతికారు. కేవలం రూ.15 విలువచేసే కిచెన్ అల్యూమినియం ఫాయిల్తో ఇళ్లను చల్లబరుచుకుంటున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం వారు పాటిస్తున్న ఆ క్రేజీ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
సూర్యరశ్మి కిటికీ అద్దాల గుండా నేరుగా ఇంట్లోకి రావడం వల్ల గది ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. దీనిని అడ్డుకోవడానికి కిటికీలకు అల్యూమినియం ఫాయిల్ పేపర్ను అంటిస్తున్నారు. ఈ ఫాయిల్ పేపర్ సూర్యుడి నుంచి వచ్చే వేడి కిరణాలను అద్దంలా ప్రతిబింబించి, తిరిగి బయటకు నెట్టేస్తుంది. అయితే, దీనిని కిటికీ లోపలి వైపు కాకుండా, బయటి వైపు అంటించడం వల్ల అద్దాలు వేడెక్కకుండా ఉండి మరింత మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్యూమినియం కరిగిపోతుందనే భయం కూడా లేదు.. ఎందుకంటే ఇది త్వరగా కరగదు.
Also Read: ఏసీ ఆన్ చేశాక ఈ రెండు మార్పులు చేసుకుంటే.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది!
పగటిపూట ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కిటికీలను, తలుపులను పూర్తిగా మూసి ఉంచి, మందపాటి తెరలను (కర్టెన్లు) వేయడం మంచిది. ఎండ తగ్గి, వాతావరణం చల్లబడే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మాత్రమే కిటికీలను తెరిస్తే గదిలోకి చల్లని గాలి వస్తుంది. అలాగే గదుల్లో అక్కడక్కడా గిన్నెల్లో నీళ్లు ఉంచడం వల్ల, ఆ నీరు ఆవిరై గదిలోని వేడిని కాస్త తగ్గిస్తుంది. ఇంట్లో పెంచుకునే మొక్కలు కూడా గాలిలో తేమను విడుదల చేసి సహజసిద్ధమైన ఏసీలా పనిచేస్తాయి.
మనం వాడే ల్యాప్టాప్లు, టీవీలు, గేమ్ కన్సోల్లు, చివరకు మొబైల్ ఛార్జర్లు కూడా స్టాండ్బై మోడ్లో ఉన్నప్పుడు కొంత వేడిని విడుదల చేస్తాయి. ఇవన్నీ కలిసి గది ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి.. అవసరం లేనప్పుడు వాటన్నిటినీ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఎక్కువ కాంతిని ఇచ్చే బల్బుల స్థానంలో LED బల్బులను వాడటం వల్ల ఇళ్లు చల్లగా ఉండటమే కాకుండా కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది.