NASA Artemis II Crew Lunar Flyby: ప్రతిష్టాత్మక Artemis II మిషన్ ద్వారా మానవ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం రాయబోతుంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి వ్యోమగామి బృందం, ఏప్రిల్ 6న చారిత్రాత్మక లూనార్ ఫ్లైబై మైలురాయిని చేరుకోనుంది. ఈ యాత్రలో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడికి అవతలి వైపు ప్రయాణిస్తున్నప్పుడు సుమారు 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయి, అంతరిక్షంలో పూర్తి ఏకాంతంలో గడపనున్నారు.
ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ 10 రోజుల ప్రయాణం భూమి.. చంద్రుడి చుట్టూ స్లింగ్షాట్ కక్ష్యలో సాగుతోంది. ఈ మిషన్ ద్వారా అంతరిక్ష రంగంలో పలు రికార్డులు సృష్టించబడనున్నాయి. క్రిస్టినా కోచ్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. విక్టర్ గ్లోవర్ ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి వ్యక్తిగా నిలవనున్నారు. కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్, చంద్రుడి వద్దకు వెళ్తున్న తొలి అమెరికాయేతర వ్యోమగామిగా చరిత్రకెక్కనున్నారు. ఈ ముగ్గురితో పాటు మిషన్ కమాండర్ రీడ్ వైస్మ్యాన్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఓరియన్ క్యాప్సూల్ చంద్రుడికి వెనుక వైపున ప్రయాణిస్తున్నప్పుడు రేడియో.. లేజర్ సంకేతాలు నిలిచిపోనున్నాయి. గతంలో అపోలో 11 మిషన్ సమయంలో మైఖేల్ కాలిన్స్ ప్రయాణించిన స్పేస్ నౌక 48 నిమిషాల పాటు సంకేతాలు అందించలేదు. ఈ సమయంలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలాన్ని ఫోటోలు తీయడం.. పరిశీలించడం వంటి పనులు చేస్తారు. ఈ యాత్రలో వారు భూమి నుండి సుమారు 4,100 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి, అపోలో 13 సృష్టించిన దూరం రికార్డును అధిగమించనున్నారు.
ఈ ఫ్లైబై సమయంలో చంద్రుడు సూర్యుడిని అడ్డుకోవడం వల్ల వ్యోమగాములకు సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించే అరుదైన అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో సూర్యుని చుట్టూ ఉండే కరోనా వెలుగులను వారు చూసే అవకాశం ఉంది. వ్యోమగాములు తమ వద్ద ఉన్న కెమెరాలతో పాటు ఐఫోన్లను కూడా చిత్రాల కోసం ఉపయోగిస్తున్నారు. చంద్రుడి ఉపరితలంపై మానవుల కంటపడని ‘ఓరియంటల్ బేసిన్’ వంటి ప్రాంతాలను వీరు పరిశీలించనున్నారు.
ఫ్లైబై ముగిసిన తర్వాత ఆర్టెమిస్ II బృందం నాలుగు రోజుల పాటు ప్రయాణించి, ఏప్రిల్ 10న శాన్ డియాగో సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ కానుంది. తిరుగు ప్రయాణంలో వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోని తమ సహచరులతో నేరుగా సంభాషించనున్నారు. ఇది చంద్రుడి వద్ద నుండి వస్తున్న బృందం కక్ష్యలో ఉన్న సహచరులతో మాట్లాడటం చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది.
Read Also: Iran: ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?