Paytm Pocket Money: డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆన్లైన్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, టీనేజర్లకు సొంతంగా బ్యాంక్ అకౌంట్ లేకపోవడం వల్ల ప్రతి చిన్నదానికి తల్లిదండ్రుల ఫోన్ లేదా ఓటీపీల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ పేటిఎం (Paytm) సరికొత్త ‘పాకెట్ మనీ’ ఫీచర్ను తీసుకువచ్చింది. దీని ద్వారా పిల్లలు తమ సొంత ఫోన్ల నుంచే నేరుగా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. టీనేజర్ల కోసం ప్రత్యేకంగా ఎలాంటి బ్యాంక్ ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. యూపీఐ సర్కిల్ (UPI Circle) విధానం ఆధారంగా ఇది పనిచేస్తుంది. తల్లిదండ్రులు తమ పేటిఎం యాప్ ద్వారా పిల్లల మొబైల్ నెంబర్ను లింక్ చేసి, కొంత అమౌంట్ను కేటాయించవచ్చు. పిల్లలు పేమెంట్ చేసినప్పుడు ఆ డబ్బులు నేరుగా పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ అవుతాయి.
స్కూల్ క్యాంటీన్, మెట్రో ప్రయాణం, ఫుడ్ ఆర్డర్స్ లాంటి రోజువారీ అవసరాలకు పిల్లలు పదే పదే డబ్బులు అడగాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అదే సమయంలో, పిల్లలు ఎంత ఖర్చు చేస్తున్నారనేది తల్లిదండ్రులు పూర్తిగా పర్యవేక్షించవచ్చు. నెలవారీ ఖర్చులకు ఒక లిమిట్ పెట్టడమే కాకుండా.. అవసరమైతే ఈ ఫీచర్ను వెంటనే నిలిపివేసే (డిసేబుల్) నియంత్రణ కూడా పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది.
Also Read: 7500mAh బ్యాటరీ, 200MP కెమెరా.. Oppo Find X9 Proపై ఫ్లిప్కార్ట్లో మైండ్ బ్లోయింగ్ ఆఫర్!
తల్లిదండ్రులు తమ పేటిఎం యాప్ను అప్డేట్ చేసి, అందులోని పాకెట్ మనీ ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ పిల్లల మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడీని ఎంటర్ చేసి, ఎంత లిమిట్ ఇవ్వాలో సెట్ చేయాలి. ఆ తర్వాత అవతలి వైపు పిల్లలు ఆ ఇన్విటేషన్ను యాక్సెప్ట్ చేయగానే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. సెక్యూరిటీ కోసం మొదట్లో కొన్ని గంటల పాటు ట్రాన్సాక్షన్ లిమిట్ చాలా తక్కువగా ఉంటుంది.
ఈ కొత్త విధానం వల్ల పిల్లలకు చిన్నతనం నుంచే డబ్బును ఎలా పొదుపుగా వాడుకోవాలో అలవడుతుంది. చేతికి నగదు ఇవ్వడం కంటే.. ఇలా డిజిటల్ రూపంలో పాకెట్ మనీ ఇవ్వడం వల్ల వారు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారనేది కూడా పేరెంట్స్ సులభంగా ట్రాక్ చేయవచ్చు. భద్రతతో కూడిన ఈ డిజిటల్ స్వేచ్ఛ భవిష్యత్తులో మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: ఫోన్ కింద పడ్డా, నీళ్లలో మునిగినా నో ప్రాబ్లం.. రియల్మీ నుంచి రఫ్ అండ్ టఫ్ 5G మొబైల్ వస్తోందోచ్!