Poco M8 5G: తక్కువ ధరలో స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న యూజర్లకు పండగ లాంటి వార్త. ప్రముఖ చైనా బ్రాండ్ తన Poco M8 5G స్మార్ట్ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి దించనుంది. జనవరి నెలలో విడుదల కానున్న కొత్త స్మార్ట్ఫోన్ల జాబితాలో ఈ కొత్త ఫోన్ గట్టి పోటీకి సిద్ధమౌతుంది. కొన్ని రోజులుగా పోకో సంస్థ ఈ M8 5G మోడల్ను టీజర్ల ద్వారా పరిచయం చేస్తూ.. యూజర్లలో ఆసక్తిని పెంచుతోంది.
భారత్లో ఇప్పటికే రెడ్మీ నోట్ 15, రియల్మీ 16 ప్రో సిరీస్ల గురించి ప్రకటించిన కొద్ది రోజులకే.. Poco M8 5G లాంచ్ వివరాలు కూడా వెలువడ్డాయి. తాజాగా వెలువడిన వివరాల ప్రకారం.. ఈ హ్యాండ్ సెట్ 2026 జనవరి 8న భారత మార్కెట్లో విడుదల కానుంది.
పోకో M8 5G తేలికపాటి బాడీతో వస్తుందని ఇప్పటికే లీక్స్ ద్వారా నిర్ధారించబడింది. ఈ ఫోన్ 7.35 మిల్లీమీటర్ల మందంతో, 178 గ్రాముల బరువుతో ఉండనుందని సమాచారం. ఇక ఫొటోగ్రఫీ విభాగంలో ఇది 50MP ప్రైమరీ కెమెరాతో రానుంది. ఈ కెమెరా AI ఆధారిత ఫీచర్లతో మెరుగైన ఫొటో అనుభవాన్ని అందించనుందని కంపెనీ సూచిస్తోంది. దీంతోపాటు స్క్విర్కిల్ ఆకారంలో ఉండే కెమెరా మాడ్యూల్లో మరో రెండు సెన్సార్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది.
కొన్ని టెక్ వర్గాల అంచనాల ప్రకారం.. పోకో M8 5G రాబోయే రెడ్మీ నోట్ 15 మోడల్కు రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని టెక్ నిపుణుల అంచనా. అయితే, దీనిలో 50MP కెమెరా వంటి ప్రత్యేకతలు ఉండటంతో.. ఈ ఫోన్లో కొన్ని కీలక కీలక మార్పులతో ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ ఫోన్ పనితీరు పరంగా చూసుకుంటే.. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్తో పనిచేయనుంది. దీంతోపాటు 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Poco ఈ ఫోన్ను HyperOS 3తో లాంచ్ చేయవచ్చని లీక్స్ సూచిస్తున్నాయి. అలాగే ఇది అండ్రాయిడ్ 15 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే అవకాశం కనిపిస్తోంది. డిస్ప్లే విషయంలో కూడా పోకో M8 5G వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన AMOLED డిస్ప్లే దీనిలో ఉండే అవకాశం ఉండనుంది. అలాగే బ్యాటరీ సామర్థ్యం కూడా ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీర్ఘకాలిక వినియోగానికి అనువుగా పెద్ద బ్యాటరీని అందించే అవకాశముంది.
పోకో M8 5G భారత మార్కెట్లో సుమారు రూ.13,000 ప్రారంభ ధరతో లాంచ్ కావచ్చని అంచనా. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న Poco M7 ధర కంటే కాస్త ఎక్కువ అయినప్పటికీ.. 5G సపోర్ట్, మెరుగైన ప్రాసెసర్, అధునాతన ఫీచర్లను వలన ఈ ధర సమంజసంగా ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.