KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సందడి చేశారు. మదీనా యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ కేటీఆర్ స్వయంగా బ్యాట్ పట్టారు.
మైదానంలోకి దిగిన కేటీఆర్ తనదైన శైలిలో చమత్కరిస్తూ వాతావరణాన్ని సరదాగా మార్చేశారు. బౌలింగ్ చేయబోతున్న వ్యక్తితో ‘సర్.. బాల్ కొంచెం నెమ్మదిగా వేయండి’ అంటూ జోక్ చేయడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. కేటీఆర్ మొత్తం మూడు బంతులను ఎదుర్కొన్నారు.
అయితే.. ఆయన ఆడిన తొలి బంతినే అద్భుతమైన షాట్తో స్టేడియం బయటకు పంపారు. కేటీఆర్ కొట్టిన సిక్సర్ను చూసి స్టేడియంలోని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. రాజకీయాల్లోనే కాదు.. క్రీడల్లోనూ తనకు మంచి పట్టు ఉందని ఆయన నిరూపించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణను, ఐక్యతను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.