సూర్యోదయం.. సూర్యస్తామయం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. నింగి మొత్తం ముదురు కాషయ రంగుతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే, ఇది మనకు నిత్యం కనిపించేదే. కానీ, అరోరాలు చాలా డిఫరెంట్. అవి నీలి, పచ్చ రంగుల్లో మెరుస్తూ భలే చిత్రంగా ఉంటాయి. ఏదో ప్రోగ్రామింగ్ చేసిన లైటింగ్ సెటప్లా కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతులతో ఆకట్టుకుంటాయి. అరోరాలను.. అరోరా బొరియాలిస్ (Aurora Borealis) లేదా నార్తర్న్ లైట్స్ (Northern Lights) అని కూడా పిలుస్తారు. అయితే, ఇవి ఎక్కడపడితే అక్కడ కనిపించవు. కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఐస్లాండ్, కెనడా, అలాస్కాలో ఎక్కువగా కనిపిస్తాయి.
సాధారణంగా ఇండియాలో ఈ అరోరాలు అస్సలు కనిపించవు. అయితే, ఇటీవల లడఖ్లో ఈ అరోరాలు కనిపించాయి. ఇవి చూసేందుకు చాలా అందంగా.. ఆహ్లాదాన్ని అందించేలా ఉన్నాయ్. కానీ, అవి ఎర్ర రంగులో ఉన్నాయి. ఈ రంగులో కనిపించడం చాలా అరుదు. అందుకే పరిశోధకులు దీనిపై కలవరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ అరోరాలు సౌర జ్వాలలు (Solar Flare), భూ అయస్కాంత తుఫాను (Geomagnetic storm) వల్ల ఏర్పడింది. సూర్యుడిపై ఏర్పడే విస్ఫోటనాల ఫలితంగా ఈ సోలార్ ఫ్లేర్స్ ఏర్పడతాయి. అవి శక్తివంతమైన రేడియేషన్, శక్తిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. అవి భూమిపై ఉండే అయస్కాంత క్షేత్రాన్ని అల్లకల్లోలం చేస్తాయి. ఫలితంగా జియోమ్యాగ్నటిక్ తుఫాన్ ఏర్పడుతుంది.
జనవరి 18వ తేదీన సూర్యుడి నుంచి సెకనుకు 1,700 కిమీల వేగంతో ఎక్స్-క్లాస్ ఫ్లేర్ భూ అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించాయి. అక్కడ జీ4 లెవెల్ జియోమ్యాగ్నెటిక్ తుఫాన్ను సృష్టించాయి. తాజాగా లడఖ్ గగనతలంలో కనిపించిన ఎర్రటి అరోరాలు కొత్త చర్చకు దారితీశాయి. సూర్యుడు అస్థిరతతో కూడిన యుగంలోకి ప్రవేశిస్తున్నాడని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం ఎక్కువైతే మన ఉపగ్రహాలపై దుష్ప్రభావాలు చూపవచ్చని, ముఖ్యంగా సిగ్నల్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల ఇంటర్నెట్ తదితర సేవలకు భగం వాటిల్లే అవకాశాలున్నాయి.
సూర్యుడి నుంచి నిరంతరం సౌర పవనాలు వీస్తుంటాయి. వాటిలో ఉండే కణాలు చాలా యాక్టీవ్గా ఉంటాయి. కొన్నిసార్లు అవి ‘కరోనాల్ మాస్ ఎజెక్షన్’గా పేర్కొనే భారీ విస్ఫోటనాల నుంచి ఉత్పన్నం అవుతాయి. ఆ కణాలు భూ అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొట్టగానే.. ఆక్సిజన్, నియోన్ వంటి వాయువులు ఏర్పడతాయి. అవి కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తాయి. అవే మనకు అరోరాలుగా కనిపిస్తాయి.
సూర్యుడి నుంచి వెలువడిన సౌర కణాలు చాలా ఎత్తైన కక్ష్యలో భూ అయస్కాంత క్షేత్రంలో నేరుగా ఆక్సిజన్ వాయువులను ఢీకొట్టి ఉండవచ్చు. అంటే సుమారు 300 కిమీల ఎత్తున. అక్కడ గాలి చాలా పలుచగా ఉంటుంది. దానివల్ల అక్కడ అదనపు శక్తి వెలువడి ఉండవచ్చు. అందుకే అవి అక్కడే విస్ఫోటనం చెంది ఎర్రని కాంతిని వెదజల్లాయి. ఫలితంగా మనకు ఎర్రటి అరోరాలు కనిపించాయి.
మన సూర్యుడు 11 సంవత్సరాల కాలచక్రాన్ని అనుసరిస్తాడు. దీన్నే మనం సౌర చక్రం అని పిలుస్తాం. మనం ప్రస్తుతం 25వ సౌర చక్రంలో ఉన్నాం. ఇది నాసా గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువ తీవ్రంగా ఉందట. ఫలితంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం తలకిందులై.. సౌర జ్వాలల సంఖ్య పెరుగుతాయి. అవి భూ అయస్కాంత క్షేత్రానికి చేరినప్పుడల్లా మన ఉపగ్రహాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. జనవరి 19, 20 తేదీల్లో కనిపించిన ఎర్రటి అరోరాలకు ఎక్స్ క్లాస్ ఫ్లేర్ కారణమని చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో.. సూర్యుడు అత్యధిక శక్తితో అస్థిరతను కోల్పోతున్నాడని పరిశోధకులు చెబుతున్నారు.
సూర్యుడి నుంచి వేడి మాత్రమే పుడుతుందని మనం అనుకుంటాం. కానీ, దానిపై ఏర్పడే విస్ఫోటనాలు భూ అయస్కాంత క్షేత్రాలనే నాశనం చేయగలవు. సూర్యుడిపై ఈ విస్ఫోటనాలు పెరిగే కొద్ది.. ‘కారింగ్టన్ ఈవెంట్’ వంటి సౌర తుఫాన్ల ప్రభావం మరింత పెరుగుతుంది. వీటికి భూమిపై ఉండే పవర్ గ్రిడ్ ట్రాన్స్ఫార్మర్లను కరిగించే శక్తి ఉంటుంది. ఉగపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను సైతం నాశనం చేస్తాయి. కొన్ని నెలలు, సంవత్సరాలపాటు ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభావం చూపగలదు. అదే జరిగితే ఇప్పుడు మనం వినియోగించుకుంటున్న ఇంటర్నెట్ సేవలన్నీ పూర్తిగా నిలిచిపోతాయి. మళ్లీ మనం ఇంటర్నెట్ లేని రోజులకు వెళ్లిపోతాం. జీపీఎస్లు పనిచేయవు.. విద్యుత్ గ్రిడ్లు సైతం ట్రిప్ అవుతాయి. దీని వల్ల ప్రపంచం అంధకారంలో చిక్కుకోవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలు, కమ్యునికేషన్ నెట్వర్కులు.. అన్నీ స్తంభించిపోతాయి. అంతా గందరగోళంగా మారిపోతుంది. ప్రస్తుతం మన ఇస్రో (ISRO) ఆదిత్య-L1, నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ వంటి మిషన్లు.. సూర్యుని ప్రతి కదలికను గమనిస్తున్నాయి. దానివల్ల సౌర తుఫాన్ భూమికి చేరే లోపే మన సాంకేతిక వ్యవస్థను రక్షించుకోవచ్చు.
Also Read: ఆ ఒక్క రోజు.. మనం గాల్లో తేలిపోతామా? భూమికి ఏం కానుంది.. ఇది నిజమేనా?