Galaxy Watch Green Line: కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ యూజర్లను తెగ వేధించిన ‘గ్రీన్ లైన్’ సమస్య ఇప్పుడు స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లకు కూడా పాకినట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్లతో పాటు అమోలెడ్ డిస్ప్లే ఉన్న కొన్ని ఫిట్నెస్ బ్యాండ్లలో స్క్రీన్పై నిలువుగా పచ్చటి గీతలు వస్తున్నాయని పలువురు యూజర్లు వాపోతున్నారు. దీనిపై సోషల్ మీడియా, ఆన్లైన్ ఫోరమ్స్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
సమస్య వచ్చిన డివైజ్లలో స్క్రీన్పై సన్నటి పచ్చటి గీత శాశ్వతంగా ఉండిపోతోంది. వాచ్లో ఏ ఆప్షన్ ఓపెన్ చేసినా ఆ గీత అలాగే కనిపిస్తుండటంతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. డివైజ్ను రీస్టార్ట్ చేసినా లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేసినా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. దీనిని బట్టి చూస్తే ఇది సాఫ్ట్వేర్ లోపం కాదని, హార్డ్వేర్ సమస్యేనని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ల అనుభవాల దృష్ట్యా యూజర్లలో ఆందోళన మొదలైంది.
Also Read: బడ్జెట్ ధరలో అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్లు.. Lava Virat V1 సిరీస్ ప్రత్యేకతలు ఇవే!
డిస్ప్లే ప్యానెల్ పాడవటం, లోపల ఉండే కనెక్టింగ్ కేబుల్ దెబ్బతినడం లేదా డిస్ప్లే డ్రైవర్ ఐసీలో లోపాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కొందరు యూజర్లు మాత్రం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాతే ఈ లైన్స్ వచ్చాయని చెబుతున్నారు. అయితే అప్డేట్ అయ్యే సమయంలో డివైజ్ ఎక్కువగా వేడెక్కడం వల్ల లోపల ఉన్న హార్డ్వేర్ బలహీనత బయటపడి ఉండొచ్చని, కేవలం సాఫ్ట్వేర్ వల్లే ఇది జరిగి ఉండకపోవచ్చని టెక్ నిపుణుల అంచనా.
గతంలో వన్ప్లస్, వివో, షావోమి, రియల్మీ వంటి పలు బ్రాండ్ల స్మార్ట్ఫోన్లలో ఈ గ్రీన్ లైన్ సమస్య తీవ్రంగా కలకలం రేపింది. ఇప్పుడు వేరబుల్స్ (వాచ్లు)లో కూడా ఇది కనిపించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. అయితే ఈ సమస్యపై శాంసంగ్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సమస్య కేవలం కొద్దిమందికి మాత్రమే వచ్చిందా లేక డిజైన్ లోపం వల్ల అందరికీ వస్తుందా అనేది కంపెనీ పరిశోధన తర్వాతే తేలాల్సి ఉంది.
మీ వాచ్లో కూడా ఇలాంటి గీత కనిపిస్తే, అది సాఫ్ట్వేర్ సమస్యనా లేక హార్డ్వేర్ లోపమా అని తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. వాచ్లో ఒక స్క్రీన్షాట్ తీసి చూడండి. ఒకవేళ ఆ స్క్రీన్షాట్లో గ్రీన్ లైన్ కనిపించకపోతే, అది కచ్చితంగా స్క్రీన్ హార్డ్వేర్ సమస్యేనని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో స్క్రీన్పై గట్టిగా నొక్కడం లేదా స్థానిక రిపేర్ షాపులకు తీసుకెళ్లడం చేయకూడదు. నేరుగా కంపెనీ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్ను సంప్రదించడమే సురక్షితమైన మార్గం.
Also Read: UPI పేమెంట్స్పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?