Samsung Speakers: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త ఆవిష్కరణతో మార్కెట్లోకి దూసుకొచ్చింది. సంగీత ప్రియులను అలరించేలా అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ‘మ్యూజిక్ స్టూడియో సిరీస్’ (Music Studio Series) స్పీకర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మ్యూజిక్ స్టూడియో 5’, ‘మ్యూజిక్ స్టూడియో 7’ మోడల్స్ లో ఇవి లాంచ్ అయ్యాయి. ఇంట్లోనే థియేటర్ రేంజ్ అనుభూతిని కలిగించేలా, సరికొత్త డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో ఈ స్పీకర్లను రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
శాంసంగ్ మ్యూజిక్ స్టూడియో స్పీకర్లు.. డాల్బీ అట్మాస్ (Dolby Atmos) టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఇది త్రీ-డైమెన్షనల్ (3D) ఆడియో అనుభూతిని అందిస్తుంది. గదిలోని నలుమూలల నుండి శబ్దం వినిపిస్తున్నట్లుగా అనిపించడమే కాకుండా ప్రతి చిన్న సౌండ్ ను కూడా ఎంతో స్పష్టంగా వినొచ్చు. సినిమా చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, నచ్చిన పాటలు వింటున్నా… ఈ స్పీకర్లు ఎంతగానో ఆకట్టుకుంటాయని కంపెనీ చెబుతోంది.
సాధారణ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఈ స్పీకర్లకు వై-ఫై (Wi-Fi) సపోర్ట్ కూడా అందించారు. దీనివల్ల ఇంటర్నెట్ ద్వారా నేరుగా హై-రిజల్యూషన్ ఆడియోను ఎలాంటి అడ్డంకులు లేకుండా స్ట్రీమ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్కు కాల్స్ వచ్చినా లేదా నోటిఫికేషన్లు వచ్చినా మ్యూజిక్ ఆగిపోకుండా కంటిన్యూగా ప్లే అవుతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. స్మార్ట్ హోమ్ అసిస్టెంట్లతోనూ దీనిని సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చని పేర్కొన్నాయి.
శాంసంగ్ కేవలం సౌండ్ క్వాలిటీపైనే కాకుండా ఈ స్పీకర్ల లుక్స్పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త ఇళ్లలోని ఇంటీరియర్స్కు నప్పేలా ఈ స్పీకర్లను క్లాస్, ప్రీమియం డిజైన్తో రూపొందించారు. గదిలో ఎక్కడ ఉంచినా ఇది లగ్జరీ లుక్ను ఇస్తుంది. తక్కువ స్పేస్ లో సెట్ అవుతూనే.. ఎక్కువ సౌండ్ అవుట్పుట్ను ఇవ్వడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
Also Read: నీరు లేని టాయిలెట్.. కరెంట్ లేని హీటర్.. సోనమ్ వాంగ్చుక్ ఇంట్లో ఎన్ని వింతలో!
బేసిక్ వేరియంట్ మ్యూజిక్ స్టూడియో 5 ప్రారంభ ధరను రూ.27,900గా శాంసంగ్ నిర్ణయించింది. అయితే లాంచ్ ఆఫర్ కింద రూ.24,900కు దీనిని కొనుగోలు చేయవచ్చు. మరోవైపు మ్యూజిక్ స్టూడియో 7 ప్రీమియం మోడల్ ధర రూ.39,990గా ఉంది. ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఇంట్లోనే థియేటర్ రేంజ్ ఆడియోను కోరుకునేవారికి ఈ శాంసంగ్ స్పీకర్లు బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. అధునాతన వై-ఫై ఫీచర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న ఈ స్పీకర్లు మార్కెట్లో ఉన్న ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
Also Read: గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. చాయ్ తాగే లోపు సిలిండర్ వచ్చేస్తుంది!