Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్పూర్లో నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్టకు చేరాయి. ఇళ్ల స్థలాల్లో వ్యాపార సామ్రాజ్యాలు వెలుస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెసిడెన్షియల్ భవనాలంటూ అనుమతులు పొంది, కమర్షియల్ షట్టర్ల నిర్మాణాలు జోరుగా సాగిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
అనుమతులు ఒకదానికి.. నిర్మాణాలు మరొకదానికి
డబిల్పూర్లో నివాస గృహాల కోసం మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటున్న కొందరు యజమానులు.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్లాన్ లో ఉన్నదానికి, అక్కడ జరుగుతున్న నిర్మాణానికి అస్సలు పొంతన ఉండటం లేదు. నివాస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కమర్షియల్ షట్టర్లను నిర్మిస్తూ వ్యాపార సముదాయాలుగా మారుస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం కళ్ల ముందే ఈ అక్రమ తంతు సాగుతున్నా.. వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం
‘నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని మేము పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఈ మౌనం వెనుక ఉన్న రహస్యమేంటో అర్థం కావడం లేదని, ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా పట్టు సాధించాల్సి ఉంది.. టీపీఓ
ఈ వివాదంపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) మహేష్ స్పందించారు. ‘నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించి కేవలం నెల రోజులే అయింది. మున్సిపాలిటీ పరిధిలోని పూర్తి స్థాయి పరిస్థితులపై ఇంకా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంది. డబిల్పూర్లో జరుగుతున్న నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను ఖచ్చితంగా పరిశీలిస్తాం. నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: డీలిమిటేషన్పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్కు చెక్ పడినట్లేనా?