Fried Food: మనం వంటింట్లో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లేదా బజ్జీలను వేడి నూనెలో వేయగానే.. కొద్ది నిమిషాల్లోనే అవి మంచి క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. చూస్తుండగానే జరిగే ఈ మార్పు వెనుక ఒక అద్భుతమైన రసాయన ప్రక్రియ దాగి ఉంది. ఈ మార్పే ఆయా పదార్థాలకు మంచి రంగును, సువాసనను, రుచిని అందిస్తుంది.
బంగాళాదుంపలు లేదా ఫ్రైస్ గోల్డెన్ కలర్లోకి మారడానికి వాటిలో ఉండే సహజ సిద్ధమైన చక్కెరలే కారణం. దీనిని సైన్స్ భాషలో ‘మైలార్డ్ రియాక్షన్’ అంటారు. ఆహారంలో ఉండే చక్కెరలు, ప్రోటీన్లు అధిక వేడి తగిలినప్పుడు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ముక్కల ఉపరితలంపై వేడి పెరిగేకొద్దీ, ఈ సమ్మేళనాలు కొత్త అణువులుగా మారి ఆకర్షణీయమైన బ్రౌన్ కలర్ను, నోరూరించే రుచిని తీసుకొస్తాయి.
బ్రెడ్ లేదా బజ్జీల పైన క్రిస్పీ లేయర్ ఏర్పడటానికి నూనె ఇచ్చే అధిక వేడే కారణం. నీరు 100 డిగ్రీల వద్దే మరిగితే, నూనె 170 డిగ్రీల కంటే ఎక్కువ వేడిని అందుకుంటుంది. ఈ అధిక వేడి వల్ల పదార్థం పైన ఉన్న తేమ వేగంగా ఆవిరైపోయి బ్రౌన్ కలర్ రావడం మొదలవుతుంది. లోపలి నుండి వచ్చే ఆవిరి వల్ల పైన క్రిస్పీ లేయర్ తయారవుతుంది.
Also Read: బట్టల రంగును బట్టి మనుషులను అంచనా వేస్తారా? కలర్ సైకాలజీ ఏం చెబుతోందంటే?
మనం వాడే పదార్థాలను బట్టి వాటి రుచి మారుతుంది. ఉదా: పచ్చిగా ఉన్నప్పుడు ఘాటుగా ఉండే ఉల్లిపాయలు నూనెలో వేగగానే తీపి రుచిలోకి మారిపోతాయి. వేడి వల్ల వాటిలోని ఘాటైన సల్ఫర్ సమ్మేళనాలు విచ్ఛిన్నమవడమే దీనికి కారణం. పిండిపదార్థాలు, ప్రోటీన్ల కలయిక వల్ల ఇవి క్యారమెల్ లాగా మారి తియ్యదనాన్ని ఇస్తాయి.
ఆహారం సరిగ్గా వేగాలన్నా, మంచి రంగు రావాలన్నా నూనె వేడి కరెక్ట్గా ఉండాలి. నూనె తక్కువ వేడిగా ఉంటే, ఫుడ్స్ ఎక్కువ ఆయిల్ను పీల్చేసుకుని మెత్తగా తయారవుతాయి. అదే నూనె మరీ ఎక్కువ కాగిపోతే.. లోపల ఉడక్కముందే పైన మాడిపోతాయి. అందుకే సరైన ఉష్ణోగ్రత వద్ద వేయించినప్పుడే మంచి రంగు, అద్భుతమైన టేస్ట్ వస్తాయి.
Also Read: లాండ్రీ డ్రైయర్లో అల్యూమినియం ఫాయిల్.. ప్రతి గృహిణీ తెలుసుకోవాల్సిన సీక్రెట్ ట్రిక్!