Heatwave Action Plan 2026: తెలంగాణలో నానాటికి పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. జూన్ 15 వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో సచివాలయంలో మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత 20 శాఖలకు చెందిన అధికారులతో చర్చించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2026ను మంత్రి విడుదల చేశారు.
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. మోటార్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో డిమాండ్కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని రోజుకు 14 గంటలు ఫిల్లింగ్ చేసి 15వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. మరోవైపు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి వీలుగా 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికలను పంపించాలని అధికారులను ఆదేశించారు. వడగాలుల ప్రభావం సామాన్యప్రజలపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: అద్దెకు ఏసీలు, కూలర్లు.. సమ్మర్లో వాడి ఇచ్చేస్తే చాలు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఎండ తీవ్రత అధికంగా ఉన్న నల్గొండ, మంచిర్యాల, సూర్యాపేట పెద్దపల్లి తదితర జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటోందని మంత్రి అన్నారు. ఆ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ఉష్ణోగ్రతల వేళ ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటివి చేయాలని దిశానిర్దేశం చేశారు. అటు ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులలో ఓఆర్ఎస్ ప్యాకట్లను అందుబాటులో ఉంచాలని అదేవిధంగా వేడి ప్రదేశాలలో పనిచేసే కార్మికులను రెండు బృందాలుగా విభజించి కనీసం గంట లేదా రెండు గంటల విశ్రాంతి ఇచ్చేలా రొటేషన్ పద్దతి అవలంభించేలా పరిశ్రమలకు సూచించాలన్నారు. తెలంగాణలోని బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్ధనా స్ధలాల వంటి పబ్లిక్ ప్రాంతాలలో అవసరమైన షెల్టర్లు ఏర్పాటు చేయాలని మంత్ర పొంగులేటి స్పష్టం చేశారు. మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేసి.. తాగునీరు అందించాలన్నారు.