సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను తెలివిగా ఉపయోగించుకుంటారు. సోషల్ మీడియా ద్వారానే సైబర్ స్కామ్ లు చేస్తుంటారు. ఇలాంటి రెండు బ్లాక్ మార్కెట్ సర్వీస్ లను తాజాగా టెలిగ్రామ్ నిషేధించింది. సైబర్ స్కామ్ లకు సంబంధించి ఎలాంటి సంస్థలను తాము ప్రోత్సహించబోమని ఆ సంస్థ తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, సైబర్ నేరస్థులకు సహకారం అందిస్తున్నందుకు వీటిని తాము నిషేధించినట్టు తెలిపింది టెలిగ్రామ్ సంస్థ.
సోషల్ మీడియాలో కమ్యూనికేషన్ ప్లాట్ ఫామ్స్ దే పైచేయి. వాట్సప్, టెలిగ్రామ్ ఇందులో ప్రముఖంగా ఉంటాయి. వాట్సప్ ఎప్పటికప్పుడు తమ నాణ్యతను పరీక్షించుకుంటోంది, అక్రమాలకు తావు లేకుండా భద్రతా పరమైన చర్యలు తీసుకుంటుంది. కానీ టెలిగ్రామ్ అలా కాదు. ప్రస్తుతం న్యూడ్ కంటెంట్ ప్రసారానికి టెలిగ్రామ్ ప్రధాన సాధనంగా మారుతోంది. పైరసీ సినిమాల ట్రాన్స్ ఫర్ కి, ఇతరత్రా కొన్ని ఇల్లీగల్ వ్యవహారాలకు టెలిగ్రామ్ యాప్ నే ఉపయోగించుకుంటున్నారు. చైనాకు చెందిన కొన్ని సంస్థలు కూడా ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా డిజిటల్ బ్లాక్ మార్కెట్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. జిన్ బి గ్యారెంటీ, హుయోన్ గ్యారెంటీ అనే సంస్థలు స్కామింగ్, మనీ లాండరింగ్ వ్యవహారాలను సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో టెలిగ్రామ్ యాప్ నుంచి ఆ రెండు సర్వీస్ లను డిలీట్ చేశారు.
బ్లాక్చెయిన్ పరిశోధన సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం జిన్ బి గ్యారెంటీ, హుయోన్ గ్యారెంటీ అనే రెండు బ్లాక్ మార్కెట్ లు.. 2021 నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 35 బిలియన్ డాలర్లకు పైగా బ్లాక్ మార్కెట్ లావాదేవీలు జరిపాయి. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ పంపిణీకి కూడా సహకరించేవి. వివిధ కంపెనీల నుంచి స్కామర్లు డేటా దొంగిలించి ఈ బ్లాక్ మార్కెట్లకు విక్రయించేవారు. ఈ బ్లాక్ మార్కెట్ల ద్వారా ఆ డేటాని తప్పుడు పనులకు ఉపయోగించేవారు. దొంగిలించిన డేటాకు విలువ కట్టే సంస్థలు ఉన్నంత వరకు స్కామర్లకు చేతినిండా పని ఉంటుంది. కొత్త కొత్తవాళ్లు కూడా సైబర్ నేరాలవైపు మొగ్గు చూపుతుంటారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే.. సైబర్ నేరాలను, సైబర్ నేరస్తులను ప్రోత్సహించే సంస్థలపై నిషేధం ఉండాలి. టెలిగ్రామ్ సంస్థ కూడా ఇప్పుడు అదే పని చేసింది. టెలిగ్రామ్ ప్లాట్ ఫామ్ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేదని ఆ సంస్థ తెలిపింది. రెండు బ్లాక్ మార్కెట్ లను టెలిగ్రామ్ బ్యాన్ చేయడంతో.. ఆన్ లైన్ మోసగాళ్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని అంటున్నారు. అయితే టెలిగ్రామ్ లేకపోతే మరో యాప్ ద్వారా వారు దీన్ని నిర్వహించే అవకాశం ఉంది.
టెలిగ్రామ్ బ్యాన్ చేసిన రెండు బ్లాక్ మార్కెట్లలో ఒకటైన హుయోన్ గ్యారెంటీ అనేది, కంబోడియాకు చెందిన హుయోన్ గ్రూప్ అనుబంధ సంస్థ. హుయోన్ పే అనే డిజిటల్ పేమెంట్స్ యాప్ దీనికి ఉంది. హుయోన్ క్రిప్టో కూడా ఉంది. గతేడాది హుయోన్ పే.. ఉత్తర కొరియా హ్యాకింగ్ సంస్థ అయిన లాజరస్ ఉపయోగించిన డిజిటల్ వాలెట్ నుండి లక్షా యాభైవేల డాలర్ల క్రిప్టోకరెన్సీని పొందింది. ఈ వ్యవహారంపై అమెరికా కూడా దృష్టిపెట్టింది.