TRAI Warning: టెలికాం రంగంలో పారదర్శకతకు సంబంధించి ట్రాయ్ (Telecom Regulatory Authority of India) రిలయన్స్ జియోకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్లను యూజర్లకు కనిపించకుండా దాచి ఉంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14 లోపు అన్ని ప్లాన్లకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జియోను ట్రాయ్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
ట్రాయ్ నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్స్ అన్నింటిని యూజర్లకు అందుబాటులో ఉంచాయి. అయితే జియో మాత్రం.. తన చౌకైన ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ను ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచుతున్నట్లు ట్రాయ్ గుర్తించింది. ఉదాహరణకు రోజుకు 1GB డేటా ఇచ్చే కొన్ని ప్లాన్లను జియో తన వెబ్సైట్ లేదా యాప్లో చూపకుండా కేవలం రిటైల్ స్టోర్లలో లేదా కొన్ని నిర్దిష్ట యాప్లలో మాత్రమే అందుబాటులో ఉంచుతోంది. ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని ట్రాయ్ తాజాగా స్పష్టం చేసింది.
జియో తన చౌకైన, ప్రజాధారణ పొందిన రిఛార్జ్ ప్లాన్స్ రూ.199. రూ.209, రూ.249ను వెబ్ సైట్, యాప్స్ లో కనిపించకుండా దాచిపెట్టినట్లు ట్రాయ్ విచారణ వెల్లడైంది. కొన్ని ప్లాన్లను కేవలం జియో ఫోన్ (JioPhone) లేదా జియో భారత్ (JioBharat) వాడేవారికి మాత్రమే పరిమితం చేయడంపై కూడా TRAI అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ ఫోన్ వాడినా సరే.. అన్ని ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉంచాలని ట్రాయ్ ఆదేశించింది.
Also Read: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే డేంజర్లో పడ్డట్లే.. మీ పర్సనల్ డేటా గోవిందా?
ప్రస్తుతం హైడ్ చేసిన ప్లాన్స్ ను వారం రోజుల వ్యవధిలో అంటే ఏప్రిల్ 14 లోపు వెబ్ సైట్, యాప్ పరిధిలోకి తీసుకొని రావాలని జియోను ట్రాయ్ ఆదేశించింది. ఒకవేళ జియో ఈ పారదర్శక చర్యలు తీసుకోకపోతే.. ట్రాయ్ భారీ జరిమానా విధించే అవకాశముందని టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. మెుత్తం మీద ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో.. కనిపించకుండా పోయిన చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తిరిగి అందుబాటులో రానున్నాయి. కాబట్టి జియో యూజర్లకు ఇది పండుగేనని నిపుణులు అంటున్నారు.
Also Read: ఆఫ్రికన్ నమూనాతో.. దేశంలో ఎల్పీజీ సమస్యకు చెక్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?