Ragi Milk Recipe: రోజురోజుకీ ఎండలు ముదిరిపోతున్న ఈ సమయంలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి మనం రకరకాల కూల్ డ్రింక్స్ తాగుతుంటాం. కానీ మన బామ్మల కాలం నాటి రాగి పాలు ఇచ్చే ఆరోగ్యం, రుచి మరే పానీయంలోనూ దొరకవు. రాగులు మన శరీరాన్ని చల్లబరచడంలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. ఈ డ్రింక్ కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి మంచి శక్తినిస్తాయి. ఇప్పుడు పాలు, రాగి పిండితో చాలా సులభంగా ఇంట్లోనే పానీయం ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
రాగి పిండి – ఒక కప్పు
పాలు – ఒక కప్పు
బెల్లం తరుము – అర కప్పు
ఎండు ద్రాక్ష – 10 పలుకులు
ఖర్జూరాలు – నాలుగు
యాలకుల పొడి – అర టీస్పూన్
కొబ్బరి పాలు – అర కప్పు
సబ్జా గింజలు – ఒక టీస్పూన్
Also Read: పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా? షుగర్ లేకుండా ఇలా హెల్తీ బాదం స్వీట్ చేసి పెట్టండి!
మీరు నేరుగా రాగులను వాడాలనుకుంటే మీకు కావాల్సినంత రాగులను రాత్రంతా నానబెట్టుకుని, మరుసటి రోజు మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమం నుండి పాలను వడకట్టాలి. ఒకవేళ రాగి పిండి వాడుతుంటే, దానిని తగినన్ని నీళ్లలో కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ రాగి మిశ్రమాన్ని పోసి, సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక అందులో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చివరగా కాచి చల్లార్చిన పాలు అలాగే కొబ్బరి పాలను కలిపి దించేయాలి. దీనిని చల్లగా సర్వ్ చేసేటప్పుడు పైన నానబెట్టిన సబ్జా గింజలు వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.
రాగి పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎందుకంటే.. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వేడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లం లేకుండా తీసుకుంటే చాలా మంచిది. వేసవిలో నీరసం రాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఇదొక అద్భుతమైన హెల్త్ డ్రింక్.
Also Read: చుక్క నూనె కూడా వద్దు.. ఆ ఒక్కటి ఉంటే చాలు, ఇంట్లోనే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ!