Uber : ఉబర్ సర్వీసెస్ పై తాజాగా ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఫోన్ లో బ్యాటరీ పర్సంటేజ్ ఆధారంగా క్యాబ్ సేవలందించే సంస్థలు ఛార్జీలను మారుస్తున్నాయంటూ ఈ పోస్ట్ లో తెలిపాడు. ఈ విషయాన్ని తామూ గమనించామని తెలుపుతూ పలువురు నెటిజన్స్ మద్దతిస్తున్నారు.
నిజానికి టెక్నాలజీ ఆధారంగా ఫ్లాట్ఫామ్స్ అనుసరించే ప్రైసింగ్ విధానంపై ఎప్పటినుంచో పలు రకాల వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి. క్యాబ్, ఫుడ్, గ్రోసరీలను అందించే ప్రముఖ ఫ్లాట్ఫామ్స్ ఫోన్ ధరను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనే తేడానే కాదు ఫోన్ ఖరీదుని బట్టి కూడా వేర్వేరు చార్జీలు వసూలు చేస్తున్నాయని ఎందరో ఆరోపిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయంపై పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఓ వ్యక్తి కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు క్యాబ్ సంస్థలు ఎక్కువ వసూలు చేస్తున్నాయంటూ ఆ వ్యక్తి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా ఢిల్లీకి చెందిన ఇంజనీరింగ్ హబ్ అనే టెక్ ప్లేస్మెంట్ ప్లాట్ఫామ్ నడుపుతున్న రిషిబ్ సింగ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. క్యాబ్ సర్వీస్ అందించే ఉబర్ సంస్థ ఫోన్లను బట్టి కాదు అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ బట్టి కూడా ఫేర్ లో వ్యత్యాసం చూపిస్తుందని తెలిపారు. రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఓఎస్ డివైజెస్ వినియోగించి పరిశీలించినట్టు తెలిపారు. అన్ని డివైజెస్ లోను ఒకే అకౌంట్ తో లాగిన్ అయ్యి ఓకే ప్రదేశానికి రైడ్ బుక్ చేసినప్పటికీ ఫేర్ లో తేడా ఉందని తెలిపారు.
ALSO READ : స్టేటస్ లో కొత్త అప్డేట్.. ఫోటోస్, వీడియోస్ కు నచ్చిన మ్యూజిక్ జోడించే ఛాన్స్
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ ను బట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ మారుతూ ఉందని తెలిపిన సింగ్.. 13% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అందిస్తుందని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా తక్కువ బ్యాటరీ పర్సంటేజ్ ఉన్న ఫోన్లో ఎక్కువ ఫెయిర్ చూపించిందని ఆరోపించారు. సాధారణంగా బ్యాటరీ తక్కువ ఉన్న సందర్భంలో యూజర్స్ అవసరాన్ని బట్టి డబ్బును దోచుకుంటున్నారనే ఆరోపణకు తెరతీశారు. రైడింగ్, క్యాబ్ సంస్థలు ఉపయోగించే ప్రైవింగ్ విధానంలో పారదర్శకత లేదని తెలిపారు. ఇతరు క్యాబ్ సంస్థలు సైతం ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని.. యూజర్ల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే సరైన డ్రైవింగ్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు.
ప్రస్తుతం సింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. క్యాబ్ సంస్థలు ఇలాంటి విధానాలు అనుసరించటం ఎంత మాత్రం సరైన విధానం కాదని పలువురు నైటిజన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనుభవం తమకు కూడా ఎదురైందని మరొకసారి రుజువైందని ఇంకో యూజర్ తెలిపారు. అంతేకాకుండా ఫోన్ ధరను బట్టి ఫేర్ ఉంటుందనే విషయాన్ని తాను ఎప్పుడో గుర్తించానని చెప్పుకువచ్చారు. కేవలం ఒక్క ఉబర్ మాత్రమే కాదు మిగిలిన అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఫోన్ ధరలను బట్టి చార్జీలు వసూలు చేస్తున్నాయని వెల్లడించారు.