Google Chrome Browser : గూగుల్ ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దాని క్రోమ్ బ్రౌజర్ను విక్రయించే దిశగా రంగం సిద్ధం చేసి ఒత్తిడి తెచ్చే పనిలో పడినట్లు తెలుస్తుంది. ఇందుకోసం గూగుల్ క్రోమ్ బౌజర్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) కోరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తమ పత్రిక కథనంలో వెల్లడించింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గూగుల్, సెర్చ్ మార్కెట్లో అక్రమంగా ఏకఛత్రాధిపత్యం సాధించిందని, ఆగస్టులో రూలింగ్ ఇచ్చిన జడ్జి వద్దే ఈ ప్రతిపాదన ఉంచాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోరనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ), ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు (ఓఎస్) సంబంధించిన వాటిపై ఆంక్షలు విధించాలని ఆ న్యాయమూర్తిని కోరనున్నట్లు బ్లూమ్ బెర్గ్ ప్రచురించింది.
నో కామెంట్స్ – డీవోజే : అయితే ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గూగుల్ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని కొట్టి పారేశారు. ఇది కేసులోని చట్టాల పరిధిని దాటి ఉందని గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ తెలిపారు. “డీవోజే ఓ ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోంది. ప్రస్తుత కేసులోని చట్టాల పరిధిని దాటి ఈ విషయం ఉంది. వినియోగదారులను ఇది నష్టపరిచేలా ఉంది..” అని గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ చెప్పుకొచ్చారు.
బడా టెక్ కంపెనీల ఏక ఛత్రాధిపత్యానికి అడ్డుపడేందుకు బైడెన్ సర్కారు తీసుకొన్న దూకుడు నిర్ణయంగా దీనిని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ, ట్రంప్ 2024 ఎన్నికల్లో గెలవడం కూడా ఈ కేసుపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పోలింగ్కు రెండు నెలల ముందే ఓ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ గూగుల్, తన విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. కానీ, ఒక నెల తర్వాత కంపెనీని విచ్ఛిన్నం చేయడం మంచి ఐడియా కాదు కదా? అంటూ ట్రంప్ ప్రశ్నించారు. ఇక ఈ విషయంతో పాటు గూగుల్ కేసుకు సంబంధించి అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి అమిత్ మెహతా తీర్పును చెప్పనున్నారు. వచ్చే ఏడాది ఈ విషయంపై తీర్పు రానున్న నేపథ్యంలో.. దీనిపై అప్పీలుకు వెళ్లాలని గూగుల్ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
మరో వైపు డీవోజే ప్రాసిక్యూటర్లు, కేవలం క్రోమ్ అమ్మకమే కాకుండా, మరిన్ని ప్లాన్ల కోసం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏటా యాపిల్ సహా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గూగుల్ బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా ఆ కంపెనీలు ఈ బ్రౌజర్నే డీఫాల్ట్గా తమ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలలోని ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉంచుతున్నాయి. ఇలా ఒప్పందాలను నిలిపివేయడం కూడా ప్రాసిక్యూటర్ల ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా గూగుల్ ఇప్పటికే తన హవాను నడిపిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే గూగుల్ క్రోమ్ తో పాటు గూగుల్ ఫొటోస్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్స్ తో ప్రపంచ టెక్ రంగాన్ని శాసిస్తోంది. ఇక ఈ ప్రభావాన్ని తగ్గించే దిశగా అమెరికా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
ALSO READ : కిక్కెచ్చే కిర్రాక్ ఫోన్స్.. మార్కెట్లోకి దించుతున్న ఐక్యూ.. లాంఛ్ డేట్ లీక్!