AC Side Effects: ప్రస్తుత కాలంలో ఎండల తీవ్రత పెరగడం వల్ల చాలామంది ఇళ్లు, ఆఫీసుల్లో రోజంతా ఎయిర్ కండిషనర్ (AC) ఆన్ చేసుకునే ఉంటున్నారు. అయితే ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల కొందరిలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తల బరువుగా మారడం, తలనొప్పి రావడం వంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా ఏసీలు.. గదిలోని తేమను పూర్తిగా పీల్చేస్తాయి. ఇలాంటి పొడి గాలిలో ఎక్కువసేపు ఉంటే.. శ్వాస ద్వారా, చర్మం ద్వారా మన శరీరంలోని నీరు మనకు తెలియకుండానే ఆవిరైపోతుంది. పైగా ఏసీ చల్లదనం వల్ల దాహం కూడా త్వరగా వేయదు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురై.. తలలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా తల బరువుగా అనిపిస్తూ ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
సాధారణంగా ఎవరు ఏసీ ఆన్ చేసినా.. గదిలోని తలుపులు, కిటికీలను వెంటనే మూసేస్తారు. దీనివల్ల గదిలోకి తాజా గాలి రావడం తగ్గిపోతుంది. అలాంటి వాతావరణంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి.. ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల కూడా తల భారంగా అనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
వేసవిలో బయట విపరీతమైన ఎండ ఉంటుంది. అలాంటి వాతావరణంలో తిరిగి వచ్చి.. ఒక్కసారిగా చల్లటి ఏసీ గదిలోకి ప్రవేశించినప్పుడు శరీరంలో సహజంగానే కొన్ని మార్పులు చేసుకుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చల్లదనం నుంచి ఒక్కసారిగా వేడి వాతావరణంలోకి వెళ్లినా లేదా ఎండ నుంచి అకస్మాత్తుగా చల్లటి గదిలోకి వచ్చినా ఆ ఉష్ణోగ్రత మార్పును శరీరం తట్టుకోలేదని పేర్కొంటున్నారు. ఈ మార్పుల వల్ల తలలోని నరాలు, రక్తనాళాలపై ఒత్తిడి పడి తీవ్రమైన తలనొప్పి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఏసీ నుండి వచ్చే పొడి గాలి ముక్కులోని మెంబ్రేన్ను (పొరను) డ్రైగా మార్చేస్తుంది. దీనివల్ల సైనస్ గ్రంథుల్లో ఇన్ఫెక్షన్ రావడం లేదా అక్కడ శ్లేష్మం గడ్డకట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ముక్కు బ్లాక్ అవ్వడానికి, కనుబొమ్మల పైన, తల భాగంలో విపరీతమైన బరువుగా అనిపించడానికి దారితీయవచ్చని వివరిస్తున్నారు.
Also Read: కొత్త స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలియకపోతే.. డబ్బులు దండగే!
విపరీతమైన ఎండల నేపథ్యంలో ఏసీలో గంటలకొద్ది ఉండక తప్పడం లేదని చాలా మంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఏసీలో ఉంటూనే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా గంటకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఏసీ టెంపరేటర్ 24 నుంచి 26 మధ్య ఉండేలా చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. మధ్యమధ్యలో కాసేపు ఏసీ రూమ్ నుండి బయటకు వచ్చి తాజా గాలి పీల్చుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.
Also Read: సముద్ర తీర జిల్లాల్లో ఏసీ కొంటున్నారా? జాగ్రత్త భయ్యో.. ఈ తప్పులు అస్సలు చేయకండి!