T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ కు తొలి ఓటమిని రుచి చూపింది… ఇంగ్లాండ్. కివీస్ పై 20 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ గెలుపుతో గ్రూప్ 1 నుంచి ఏయే జట్లు సెమీస్ కు వెళ్తాయనేది ఉత్కంఠ రేపుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు… ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు ఇద్దరూ 81 రన్స్ జోడించారు. హేల్స్ 40 బంతుల్లోనే 52 రన్స్ చేసి ఔట్ కాగా… 47 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 73 రన్స్ చేసిన బట్లర్… దురదృష్టం కొద్దీ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, స్టోక్స్ వెంటవెంటనే ఔటయ్యారు. చివర్లో లివింగ్ స్టోన్ ఒక్కడే ధాటిగా ఆడటంతో… 20 ఓవర్ల లో 6 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది… ఇంగ్లండ్.
180 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్… ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ డేవన్ కాన్వే 3 పరుగులే చేసి ఔట్ కాగా… మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా 16 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ పోరాడారు. మూడో వికెట్కు 91 పరుగులు జోడించి… జట్టు గెలుపుపై ఆశలు రేకెత్తించారు. కానీ 16 పరుగుల వ్యవధిలో విలియమ్సన్, ఫిలిప్స్ తో పాటు జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్ కూడా ఔట్ కావడంతో… న్యూజిలాండ్ పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. చివరి రెండు ఓవర్లలో కివీస్ విజయానికి 40 రన్స్ కావాల్సి వచ్చాయి. 19వ ఓవర్లో ఓ సిక్సర్ సహా 14 పరుగులు వచ్చినా… చివరి ఓవర్లో శామ్ కరన్ 5 రన్స్ మాత్రమే ఇవ్వడంతో… విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది… న్యూజిలాండ్. 20 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్.. సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. 73 రన్స్ చేసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన జోస్ బట్లర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.