Garry kirsten on Ind Vs Pak : పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇక ఇందులో పాకిస్తాన్ పై టీమిండియా గెలిస్తే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రెండు దేశాల మధ్య గొడవల నేపథ్యంలో కేవలం ఐసీసీ టోర్నమెంటులో మాత్రమే టీమిండియా అలాగే పాకిస్తాన్ తలపడుతున్నాయి. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ( ICC Mens T20 World Cup 2024 ) సందర్భంగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ కావాలనే ఓడిపోయిందని.. దీని వెనుక ఆ జట్టుకు సంబంధించిన ఐదుగురు ప్లేయర్లు కుట్రలకు తెరలేపారని గారీ క్రిస్టెన్ (Garry kirsten) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్తాన్ కోచ్ గా గారీ క్రిస్టెన్ పని చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అప్పటి సంఘటనను తాజాగా గారీ క్రిస్టెన్ గుర్తు చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024 సందర్భంగా పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య గ్రూప్ మ్యాచ్ జరుగగా ఈ మ్యాచ్ పై గారీ క్రిస్టెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ 2024 సందర్భంగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయేలా… ఆ జట్టుకు సంబంధించిన ఐదుగురు ప్లేయర్లు కుట్రలకు తెర లేపారని అప్పటి కోచ్ గారీ క్రిస్టెన్ హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే బాబర్ ఆజం కెప్టెన్సీ ప్రమాదంలో పడుతుందని.. కుట్రలకు తెరలేపినట్లు బాంబు పేల్చారు. ఆ ఐదుగురు ప్లేయర్లు మ్యాచ్ కంటే ముందే పన్నాగం వేసి.. పాకిస్తాన్ జట్టును ఓడించారన్నారు. 120 బంతుల్లో 120 పరుగులు కొట్టాల్సిన మ్యాచ్ నేపథ్యంలో… సులభంగా పాకిస్తాన్ గెలుస్తుందని తాను కూడా అనుకున్నట్లు వెల్లడించారు. కానీ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఆ ఐదుగురు ప్లేయర్లు.. బాబర్ ఆజం కెరీర్ దెబ్బ తీసేందుకు ప్లాన్ వేశారని ఆరోపణలు చేశారు గారీ క్రిస్టెన్.
ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు పడ్డాయని.. దీంతో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు. బాబర్ ఆజంను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ దేశ పరువును గంగలో కలిపారని ఆ ఐదుగురు క్రికెటర్ల పై సీరియస్ అయ్యారు. అయితే ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరు అనే దాని పైన మాత్రం గారీ క్రిస్టెన్ పెదవి విప్పలేదు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో… ఆ ఐదుగురు క్రికెటర్లు కుట్ర పన్నినట్లుగానే బాబర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టులో అవకాశం కోసం బాబర్ పోరాడుతూనే ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ సందర్భంగా పాక్ పై 6 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి, 119 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 113 పరుగులు మాత్రమే చేసింది పాక్. ఈ క్రమంలో టీమిండియా గెలిచింది.