Gambhir: కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేదించలేక.. 30 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఈ తొలి టెస్ట్ ఫలితం కేవలం రెండున్నర రోజులలోనే తేలిపోయింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది. భారత బ్యాటర్లలో ఒక్క వాషింగ్టన్ సుందర్ {92 బంతుల్లో 31} మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయారు.
Also Read: Ind VS Sa 1st Test: గిల్ తెలివిగా తప్పుకున్నాడు.. గంభీర్ బుక్ అయ్యాడు..!
మొదటిరోజు మొదటి సెషన్ నుంచే పిచ్ పై బౌన్స్ కనిపించింది. ఆ తరువాత రెండవ రోజు ఆటలో పిచ్ పై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడి.. పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. దీంతో స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పుతూ భారత బ్యాటర్లను బోల్తా కొట్టించారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో భారత జట్టు పతనాన్ని శాసించాడు. మరో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ సమయంలో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా సైతం నాలుగు వికెట్లు సాధించాడు. అంటే ఈ పిచ్ స్పిన్నర్లకు ఏమేర అనుకూలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తొలి టెస్ట్ లో ఘోర ఓటమి అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ స్పందించాడు. తాము కావాలనే ఇటువంటి పిచ్ ని కోరుకున్నట్లు స్పష్టం చేశాడు. “మేము అడిగిన విధంగా పిచ్ ని తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాం. ఎప్పటినుండో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూశాం. క్యూరేటర్ మాకు అన్ని విధాలా సహకరించారు. కానీ ఈ వికెట్ పై మా ప్లేయర్లు మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయారు. ఆ కారణంగానే మేము ఓడిపోయాం. ఇది బ్యాటింగ్ కి కష్టతరమైన పిచ్ కాదు. టెస్టుల్లో ఆడాలంటే స్కిల్ తో పాటు మెంటల్ టఫ్ నెస్ ఉండాలి. 124 పరుగులు చేదించగలిగిన టార్గెట్. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్ పై ఆడాలంటే టెక్నిక్, టెంపరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ వికెట్లు పడ్డాయి. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది. మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటేనే ఇలాంటి వికెట్ పై కూడా పరుగులు సాధించవచ్చు” అని చెప్పుకొచ్చాడు.
Also Read: Vaibhav Suryavanshi: 200 పరుగులు చేసినా, మా అయ్య ఊరుకోడు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు, మ్యాచ్ సమయంలో తీసుకున్న నిర్ణయాలపై మాజీ క్రికెటర్ల నుంచి నెటిజెన్ల వరకు తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం గంభీర్ తప్పులే కారణమని, బ్యాటింగ్ ఆర్డర్ లో పదేపదే మార్పులు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు క్రీడాభిమానులు. స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ ని జట్టులోకి తీసుకొని బెంచ్ కి పరిమితం చేశాడని, ఈ పిచ్ పై నలుగురు స్పిన్నర్లు అవసరంలేదని కామెంట్స్ చేస్తున్నారు. గత సంవత్సరం న్యూజిలాండ్ తో వైట్ వాష్ అయినప్పటికీ.. వాటి నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ స్పిన్ పిచ్ లే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.