Esha Singh: స్వేచ్చ బ్యూరో: భారత షూటింగ్ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం లిఖితమైంది. హైదరాబాద్కు చెందిన యువ షూటర్ ఈషా సింగ్ జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నెలకొల్పి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ప్రపంచంలోని 85 దేశాల నుంచి 723 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో ఈషా సింగ్ ఫైనల్లో 43/50 స్కోర్ నమోదు చేసి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు.
ఈ ప్రదర్శనతో ఆమె జూనియర్ మరియు సీనియర్ విభాగాల్లో ఒకేసారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అరుదైన ఘనతను సాధించారు. ఈ విజయంతో ఐఎస్ఎస్ఎఫ్ సీజన్ 2026లో భారతదేశానికి తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా కూడా ఈషా నిలిచారు. ప్రపంచ స్థాయి పోటీల్లో ఒత్తిడిని అధిగమిస్తూ కనబరిచిన ఆమె ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, నైపుణ్యం ప్రపంచ షూటింగ్ వర్గాల ప్రశంసలను అందుకుంటోంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఈషా సింగ్ భారత షూటింగ్లో అత్యంత ప్రతిభావంతమైన యువ క్రీడాకారిణులలో ఒకరిగా ఎదిగారు.
Also read: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
ఇప్పటికే పారిస్ 2024 ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు ప్రపంచ రికార్డుతో భారత షూటింగ్ను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఈషా సింగ్ మాట్లాడుతూ, ప్రపంచ రికార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశం కోసం పోటీ పడటం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతి అని వివరించారు. ఈ విజయానికి కారణమైన తన కోచ్లు, కుటుంబ సభ్యులు, భారత షూటింగ్ సమాఖ్య, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తనను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయం భారతదేశానికి అంకితమని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి మరింత గౌరవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ఈషా సింగ్ సాధించిన ఈ ప్రపంచ రికార్డు భారత షూటింగ్కు మాత్రమే కాకుండా దేశంలోని యువ క్రీడాకారులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ విజయం భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
Also read: Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్లో బాధితులు..?