Trading Scam: స్టాక్మార్కెట్ ట్రేడింగ్ ఒకప్పుడు మెట్రో సిటీలకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు అనేక పట్టణాలకు కూడా విస్తరించింది. కొందరు స్టాక్ మార్కెట్ గురించి తమకు పూర్తి అవగాహన ఉందంటూ బంధువులు, స్నేహితులతో పెట్టుబడులు పెట్టిస్తారు. వారి డబ్బుతో ట్రేడింగ్ చేస్తారు. చివరికి పూర్తిగా నష్టపోయి. చెతులెత్తేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దొంగల నరేష్ రెడ్డి ఆరిజన్ సొల్యూషన్స్ పేరుతో అనంతపురంలో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. కార్పొరేట్ తరహాలో హంగూ ఆర్భాటాలతో ఉండేది ఆ ఆఫీస్.
నరేష్ రెడ్డి తీరు ఆ ఆఫీస్ మెయింటనెన్స్ చూసి స్నేహితులు, బంధువులతో మొదట కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టించారు. వారి పెట్టిన పెట్టుబడిపై మూడు రూపాయల వడ్డీ ఇచ్చాడు. దీంతో వారిలో నమ్మకం పెంచాడు. నరేశ్ రెడ్డి హంగూ ఆర్భాటాలు చూసి నిజంగా సంపాదిస్తున్నాడనే భ్రమలోకి బంధువులు, స్నేహితులు వెళ్లిపోయారు. మొదట్లో ఇచ్చిన లాభాలు తిరిగి పెట్టుబడిగా పెడితే.. పది, పదిహేను రూపాయల వడ్డీ ఇస్తానంటూ నమ్మించాడు. ఇలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు దాదాపు 120 మంది నుంచి పెట్టుబడులు పెట్టించాడు.
మొదట్లో అంతా బాగానే ఉండేది. నమ్మకంగా లాభాలను పంచాడు. కానీ ఆ తర్వాతే కథ మారింది. పది, పదిహేను రూపాయల వడ్డీ ఆశజూపించి మరింత డబ్బు వసూలు చేసినప్పుడే కథ అడ్డం తిరిగింది. డబ్బులు ఇవ్వడం మానేశాడు. తమ డబ్బులు ఎక్కడ అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. తాను నష్టాల్లో ఉన్నానని త్వరలో డబ్బు మొత్తం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత నరేష్ రెడ్డి పరారయ్యాడు. ఫోన్లో కూడా స్పందించడం లేదని బాధితులు నెత్తినోరూ కొట్టుకుంటున్నారు. మొత్తంగా 25 కోట్ల వరకు బాధితుల నుంచి వసూలు చేశారని తెలుస్తోంది.
Also read: తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు
మరి ఏమైనా నష్టం వచ్చిందా అంటే అదీ లేదని చెబుతున్నాడట నరేష్ రెడ్డి. తనకు స్టాక్ మార్కెట్లో ఎలాంటి నష్టం రాలేదు.. కానీ 25 కోట్ల దాక అప్పు ఉన్నట్టు చెబుతున్నాడని బాధితులు చెబుతున్నాడు. అతని బాధితుల ఆవేదన ఏంటో ఓసారి వినండి. స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఒక్క రోజులో భారీ స్థాయిలో డబ్బు ఎలా వస్తుందో.. అదే స్థాయిలో డబ్బు కూడా పోతుంది. ఇదంతా జరగడానికి అనుభవం లేకపోవడం అత్యాశ ఉంటే చాలు. కథ ఒక్క రోజులో మారిపోతుంది. నరేష్ రెడ్డి కూడా భారీ స్థాయిలో ట్రేడ్ చేసి అత్యాశకు పోయి నిండా మునిగి ఉండొచ్చు.. లేదా వచ్చిన డబ్బుతో జెండా తిప్పేసి ఉండొచ్చు.
ఈ కథలో మరో దారుణమైన విషయం ఏంటంటే.. తన కంపెనీలో దాదాపు 50 మంది అమ్మాయిలకు ఉద్యోగం ఇచ్చాడు నరేష్ రెడ్డి. వారికి పదివేలు జీతం ఇచ్చి వారికి కూడా డబ్బు ఆశజూపి, పెట్టుబడి పెట్టించాడని తెలుస్తోంది. ఆ తర్వాత వారికి కూడా బంధువులకు, స్నేహితులకు ఇచ్చిన సమాధానమే ఇచ్చినట్టు తెలుస్తోంది. బాధితులు నరేష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
అందుకే కష్టపడకుండా కోట్లు వస్తాయంటే అది కరెన్సీ నోటు కాదు, మిమ్మల్ని ముంచేసేస్కెచ్ అని మనం తెలుసుకోవాలి రెప్పపాటులో ధనవంతులు అయిపోవచ్చు అనే అత్యాశే మీ జీవితకాల సంపాదనను బూడిదలో పోసిన పన్నీరు చేస్తోందని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి. అప్పటి వరకు ఇలాంటి నరేష్ రెడ్డిలు వస్తూనే ఉంటారు మీ జేబులను గుళ్ల చేస్తూనే ఉంటారు. సో తస్మాత్ జాగ్రత్త.
Also read: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు