Gram Sabha: స్వేచ్య బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని శంకరంపేట ఆర్ మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హాజరై గ్రామస్థులతో సమావేశమయ్యారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, హార్టికల్చర్ అధికారి, ఇతర జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మురికి కాలువలను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, తాగునీటి వనరులు, వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణ రూల్స్–2026ను గ్రామపంచాయతీలు తప్పనిసరిగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి నిర్వహించాలని సూచించారు.
Also read: Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు
గ్రీన్ బుట్టలో తడి వ్యర్థాలు, బ్లూ బుట్టలో పొడి వ్యర్థాలు, రెడ్ బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నల్ల రంగు బుట్టలో ప్రత్యేక వ్యర్థాలను వేరు చేసి గ్రామపంచాయతీకి అందించాలని ప్రజలకు సూచించారు. గ్రామసభలో తాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR-2026), పంటల మార్పిడి, బడిబాట కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కోరారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు పంటల మార్పిడిని అలవాటు చేసుకొని ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
అర్హులైన లబ్ధిదారులను గ్రామసభల ద్వారా గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ప్రత్యేక గ్రామసభలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, స్వచ్ఛత పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ గ్రామ సభలో గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, వ్యవసాయ అధికారి దేవకుమార్, హార్టికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్, సర్పంచ్ సంతోష నవీన్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, స్వచ్ఛత పోస్టర్లను ఆవిష్కరించారు.
Also Read: అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!