Telangana: తెలంగాణలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిధిలో వెలుగు చూసిన అగ్రికల్చర్ బీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణం కేవలం ఒకట్రెండు ఏళ్లలో జరిగింది కాదని, గత 2017 నుంచి నిరాటంకంగా కొనసాగుతోందని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. విద్యార్థులు, ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల మధ్య ఏర్పడిన అక్రమ సంబంధాలే ఈ దందాకు మూలమని వెల్లడైంది. ముఖ్యంగా పరీక్షలకు ఒక రోజు ముందే ప్రశ్నపత్రాలు బయటకు రావడం, అవి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం వంటివి జరిగాయని తెలింది.
అయితే ఈ వ్యవహారంలో విద్యార్థులు ప్రొఫెసర్లను తమ బుట్టలో వేసుకోవడానికి ఖరీదైన మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్లకు గోవా వంటి ప్రాంతాలకు విహారయాత్రలు ఏర్పాటు చేయడం, ఖరీదైన లిక్కర్ దావత్లు ఇవ్వడం ద్వారా వారిని ప్రసన్నం చేసుకుంటున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ రకమైన ‘విందు రాజకీయాల’ వల్ల పరీక్షా పత్రాల గోప్యత గాలికి కలిసిపోయింది. విద్యార్థులు విలాసాల ఎర వేసి, ప్రొఫెసర్ల ద్వారా ముందుగానే ప్రశ్నపత్రాలను సంపాదించి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు.
ప్రొఫెసర్ల చేతికి పరీక్షకు ఒక రోజు ముందు ప్రశ్నపత్రాలు అందుతుండగా, వారు వాటిని ల్యాబ్ టెక్నీషియన్ల సహాయంతో జిరాక్స్ తీయిస్తున్నారు. అనంతరం ఆ పత్రాలను రహస్య వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్-సర్వీస్ విద్యార్థులకు పంపిస్తున్నారు. ఒక్కో ప్రశ్నపత్రం కోసం లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వరంగల్, జగిత్యాల వ్యవసాయ కళాశాలలు ఈ అక్రమాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వరంగల్ కాలేజీకి చెందిన ఒక విద్యార్థి బ్యాంక్ ఖాతా నుంచే దాదాపు 12 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించడం ఈ కుంభకోణం యొక్క తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ అక్రమాల్లో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ చదువుతున్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (AEOs), ఇతర ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో సీట్లు పొంది, ప్రమోషన్ల కోసం ఈ అడ్డదారులు తొక్కుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఈఓ (AEO) యూనియన్ నేతలు రంగంలోకి దిగి, ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండాలంటే ప్రస్తుతమున్న ‘ఇన్-సర్వీస్ అగ్రికల్చర్ బీఎస్సీ’ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: సంక్రాంతి ముందు తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు హై అలర్ట్..!
ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రొఫెసర్లు, టెక్నీషియన్లు, విద్యార్థులను విచారించిన అధికారులు, కీలకమైన డాక్యుమెంట్లను, మొబైల్ డేటాను సేకరించారు. విశ్వవిద్యాలయ అధికారులు కూడా అంతర్గత విచారణకు ఆదేశించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రశ్నపత్రాల లీకేజీలో ట్విస్ట్
పేపర్ లీకేజీలో వరంగల్ కాలేజీ సిబ్బంది పాత్ర
ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్
8 మంది ఇన్ సర్వీస్ విద్యార్థుల ప్రవేశాల రద్దు
లీకేజ్ వ్యవహారంపై ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ
పలు వ్యవసాయ… pic.twitter.com/Z3TCJHeMD1
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2026