వరంగల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి తన సొంత గూడైన భారత రాష్ట్ర సమితి (BRS) లోకి చేరారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు రమేష్కు శుభాకాంక్షలు తెలిపారు.
సొంత ఇంటికి వచ్చిన అనుభూతి
పార్టీలో చేరిన అనంతరం ఆరూరి రమేష్ భావోద్వేగంగా మాట్లాడారు. చిన్నప్పుడు దారి తప్పిన పిల్లోడు తిరిగి ఇంటికి వస్తే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో, తాను బీఆర్ఎస్లోకి రావడం పార్టీ నేతలకు అంతే ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ‘నేను బీజేపీలో ఉన్నా ఎన్నడూ బీఆర్ఎస్ను విమర్శించలేదు. విధిలేని పరిస్థితుల్లోనే ఆ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. పాలాభిషేకంతో నా హృదయాన్ని శుభ్రపరుచుకుని మరీ తెలంగాణ భవన్లో అడుగుపెట్టాను’ అని ఆయన వివరించారు.
కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు
తాను గతంలో పార్టీని వీడటానికి కడియం శ్రీహరి అనుసరించిన బురద రాజకీయాలే ప్రధాన కారణమని ఆరూరి ఆరోపించారు. కడియం శ్రీహరి స్వార్థం వల్ల వరంగల్ జిల్లాలో చాలా మంది నేతలు రాజకీయంగా ఎదగలేకపోయారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కడియం రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని, వర్ధన్నపేటలో తన ఓటమికి ఆయనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి పాపాత్ముడు పార్టీని వీడి వెళ్లడం వల్లనే తాను తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరూరి విమర్శించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర సంపద పెరిగిందని, దళిత, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ‘మార్పు కావాలని కోరుకుని ప్రజలు మోసపోయారు. వర్ధన్నపేట అభివృద్ధి కేవలం గులాబీ జెండా నీడలోనే జరిగింది’ అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వర్ధన్నపేటలో బీఆర్ఎస్ గెలుపు కోసం శ్రమిస్తానని, పార్టీని వీడిన మరికొందరు నేతలు కూడా త్వరలోనే తిరిగి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: Medaram Jatara: మేడారం వైపు సారలమ్మ పయనం.. గద్దెపైకి కొలువుదీరనున్న వనదేవతలు