ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆరంభమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత మేడారం గద్దెలపైకి బయల్దేరారు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాలు, శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరు మధ్య వనదేవత పయనం సాగుతోంది.
కన్నెపల్లిలోని ఆలయం నుంచి సారలమ్మను గద్దెలపైకి తీసుకువచ్చే బాధ్యతను పూజారి కాక సారయ్య చేపట్టారు. మున్నెన్నడూ లేని విధంగా ఈసారి భారీ పోలీస్ భద్రత నడుమ అమ్మవారిని మేడారం తరలిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల వరకు సుమారు 3.5 కిలోమీటర్ల మేర సారలమ్మ కాలినడకన ప్రయాణించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మరోవైపు సారలమ్మతో పాటు మేడారం చేరుకోవడానికి పగిడిద్దరాజు (సమ్మక్క భర్త), గోవిందరాజు (సమ్మక్క అల్లుడు) కూడా సిద్ధమయ్యారు. కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మరికాసేపట్లో మేడారం చేరుకోనున్నారు. మేడారం ఆలయ ఈశాన్య ప్రధాన ద్వారం వద్ద ఈ ముగ్గురు దేవతలు (సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు) కలవనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈశాన్య ద్వారం వద్ద ముగ్గురు దేవతలు కలిసిన అనంతరం, అక్కడి నుంచి ఊరేగింపుగా మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకోవడానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రేపు గిరిజన వీరవనిత సమ్మక్క దేవత చిలకలగుట్ట నుంచి గద్దెపైకి రాకతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.