Adi Srinivas: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. తెలంగాణ రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా 24 గంటలు పూర్తికాకముందే.. కేటీఆర్ అహంకారం తగ్గకపోవడం అర్థం కాని వ్యవహారమని ఆయన వ్యాఖ్యానించారు. చింత చచ్చినా పులుపు తగ్గదంటారు. కేటీఆర్ ప్రవర్తన చూస్తే ఇదే నిజమనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ గుర్తు ను గాడిదిని ఎక్కించి ఊరేగింపులు చేశామా అంటు అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
జూబ్లీహిల్స్లో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మైండ్ గేమ్స్ ఆడిందని, తప్పుడు సర్వేలు, ఫేక్ ప్రచారాలతో ఓటర్లను మాయ చేయాలని ప్రయత్నించిందని శ్రీనివాస్ ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటముల జాబితా చూసుకున్నా, కేటీఆర్కు సిగ్గు అనే భావం లేదని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం, పార్లమెంటులో ఒక్క సీటు కూడా రాకపోవడం, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పూర్తి ఓటమి వీటన్నిటిని కేటీఆర్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన చెల్లెలే కర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఆది శ్రీనివాస్, నీ పార్టీ బతుకులేంటి, నీ రాజకీయ భవిష్యత్తేంటిని మొదట ఆలోచించు అంటూ హితవు పలికారు. కేటీఆర్ ఒక్కసారి నోరు మూసుకుని ఆలోచిస్తే బీఆర్ఎస్కు కొంత భవిష్యత్తు ఉండొచ్చు. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాటే ఆ పార్టీకి శాపంగా మారుతోంది అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి, సంక్షేమం కాకుండా, అహంకారం, అసహనం, విమర్శల రాజకీయాలు చేస్తే బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తే ఉండదని హెచ్చరించారు.