Farmers Protest: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భారీ సంఖ్యలో రైతులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాల వల్ల సోయాబీన్, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం తమను ఆదుకోవడంలో విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో “అంతా కలిసే వచ్చాం.. అందరికీ అనుమతి ఇస్తేనే లోపలికి వెళ్తాం” అంటూ రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులకు మద్దతుగా నిలిచి, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
రైతుల ప్రధాన డిమాండ్లలో సోయా పంట కొనుగోలు, చనాక-కొరాట ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు అంశాలు కీలకంగా ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన తమకు ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదని నిర్వాసితులు మండిపడ్డారు. అలాగే, మార్కెట్లో సోయాబీన్ ధర పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు నీరందించాలని వారు నినదించారు.
Also Read: జనవరి 4న గచ్చిబౌలిలో ఎగ్జామ్థాన్ రన్.. విజేతలకు రూ.10 లక్షల ప్రైజ్ మనీ
ఈ ఆందోళనలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సోయా దిగుబడి ఎక్కువగా ఉందని గుర్తించామని, సోయా కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యేల బృందాన్ని ఢిల్లీకి పంపించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర రైతులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని, క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అసెంబ్లీ వద్ద ఆదిలాబాద్ రైతుల ఆందోళన
అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు
పార్టీలకతీతంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్న రైతులు
అధిక వర్షపాతం కారణంగా నష్టపోయామని చెబుతున్న రైతులు
అంతా కలిసే వచ్చామని.. అందరికీ అనుమతిస్తేనే లోపలికి వెళ్తామని… https://t.co/rUnfCGk3zN pic.twitter.com/GCT0mgQ0iT
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2026