Adluri Laxman: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలు, రైతాంగం, కేంద్ర నిధులు, రాష్ట్ర హక్కులపై మాట్లాడాల్సిన బాధ్యత గల ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమన్నారు.
మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘అరవింద్ కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీతో. అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘మీ భారతీయ జనతా పార్టీలా నాగపూర్లో కూర్చొని ఆదేశాలు అమలు చేసే పార్టీ కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని నడిచే ప్రజాస్వామ్య పార్టీ’ అని మంత్రి స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్ల గురించి ఎంపీ అరవింద్ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి.. ‘నిజామాబాద్లో మీ తమ్ముళ్లు చేస్తున్న అరాచకాల గురించి మేము మాట్లాడలేమా?’ అని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడాలని హితవుల పలికారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొక్కజొన్నకు మద్దతు ధర ఇప్పించాలన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని మంత్రి సవాల్ విసిరారు.మూడోసారి అధికారంలోకి వస్తామని అహంకారంగా మాట్లాడిన పార్టీ మెడలు వంచి, ప్రజలను ఒప్పించి, ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ లు ఉన్నారు.
Also Read: కాంగ్రెస్కు పెట్రో రేట్లపై మాట్లాడే అర్హత లేదు.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు