Vishweshwar Reddy: స్వేచ్ఛ బ్యూరో: పెట్రోల్, డీజిల్ రేట్లపై మాట్లాడేందుకు కాంగ్రెస్ కు ఏం హక్కు ఉందని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ యుద్ధం జరిగితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ముందుగానే చెప్పారని గుర్తుచేశారు. విదేశాలతో పోల్చితే మన దగ్గర తక్కువగానే పెరిగిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో రూ.5 లక్షల కోట్ల ఆయిల్ బాండ్స్ అమ్మిందని, బీజేపీ వచ్చిన తరువాత ఆ అప్పులను బీజేపీ తీర్చిందన్నారు. ఒకవైపు పెట్రో రేట్లే కాకుండా ఆ బాండ్స్ కూడా రీ పే చేస్తోందని వెల్లడించారు. వడ్డీతో సహా మోడీ ప్రభుత్వమే వాటిని చెల్లింస్తోందని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పాపాలన్నీ బీజేపీ కడుగుతోందన్నారు. తెలంగాణలో పాత సీఎంతో పాటు కొత్త సీఎం కూడా పెంచారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ ధర తెలంగాణలో ఉందని కొండా పేర్కొన్నారు.
మహారాష్ట్రలో రూ.109 ఉంటే, గుజరాత్ రూ.98.30, ఢిల్లీలో రూ.97, తెలంగాణ లో రూ.111.88గా ఉందన్నారు. ఇక డీజిల్ రేట్లు మహారాష్ట్రలో రూ.94.95 ఉండగా, గుజరాత్ లో రూ.93.44, ఢిల్లీలో రూ.91.95, తెలంగాణ లో రూ.99.88గా ఉందన్నారు. పెట్రోల్ దొరికే దేశాల్లో పెట్రోల్ రేట్లు తక్కువ ఉన్నాయని, కానీ మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో రేట్లు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా భారత్ కంటే పెట్రోల్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
Also Read: వివక్షపై వినూత్న నిరసన.. గుండు గీయించుకున్న బీజేపీ మహిళా కౌన్సిలర్!