Adulterated Snacks: స్వేచ్ఛ బ్యూరో: చిన్నపిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్ ను కల్తీ చేస్తున్న వారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కాగా సేకరించిన సమాచారం వేర్వేరు తయారీ కేంద్రాలపై బుధవారం దాడులు జరిపి 2 లక్షల రూపాయల విలువ చేసే స్నాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్.శ్రీనివాస్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సత్వాజీ అనే వ్యక్తి కాటేదాన్ ప్రాంతంలో మారుతి ఫుడ్స్ పేర స్నాక్స్ తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నాడు. కుర్ కురే, పోలో రింగ్స్ ను తయారు చేసి హైదరాబాద్ లోని వేర్వేరు కిరాణా షాపులకు సప్లయ్ చేస్తున్నాడు. ఇక, అతర్ రహమాన్ అనే వ్యక్తి ఇండియన్ బేకరీ అండ్ స్వీట్ హౌస్ పేర దందా చేస్తూ వేర్వేరు మిఠాయిలు, బేకరీ వస్తువులు తయారు చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నాడు. లక్ష్మీగూడలోని బృందావన్ కాలనీలో కృష్ణ రాణిదాస్ అనే వ్యక్తి కృష్ణ ఫుడ్ ప్రొడక్ట్స్ పేర మిక్చర్ తదితర తినుబండారాలను తయారు చేసి వేర్వేరు దుకాణాలను పంపిస్తున్నాడు.
Also Read: Salary tips: జీతం వచ్చిన వెంటనే ఇలా చేస్తే డబ్బు కొరత ఉండదు
ఇదే ప్రాంతంలో బల్వంత్ రావు బీఎస్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్న కేంద్రాన్ని నిర్వహిస్తూ మీల్ మేకర్, నల్లీ పాపడ్ లను తయారు చేసి అమ్ముతున్నాడు. అయితే, ఈ నాలుగు కేంద్రాల్లో నాసిరకం నూనె, ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తూ స్నాక్స్ తయారు చేస్తున్నట్టు అందిన సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. స్నాక్స్ శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Also Read: సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ.. ఇక గులాబీ బాస్కు చెక్ పెట్టినట్లేనా?..!