Kavitha: వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చి, హ్యట్రిక్ విజయం గ్యారంటీ అన్న ధీమాతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అయ్యారు. పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చేసి తెలంగాణలోనే బొక్కబోర్లా పడ్డారు. తండ్రి స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారు. అయితే ఇంకా పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించని ఆమె అప్పుడే పక్క రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కేరళంలో అధికార ఎల్డీఎఫ్ను గెలిపించాలని కవిత పిలుపునిస్తున్నారు. అసలు కవిత పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి?
కేరళం అసెంబ్లీ ఎన్నికలలో తమ మద్దతు సీఎం పినరయి విజయన్ సారధ్యంలోకి ఎల్డీఎఫ్ కూటమికేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పినవన్నీ బూటకాలని కవిత ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రజలను వంచించారు అని కవిత విమర్శించారు. రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన వంటి హామీలను గాలికొదిలేశారన్నారు. ఇప్పుడు అదే గ్యారంటీల నాటకాన్ని కేరళలోనూ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారని కవిత విమర్శించారు.
కాంగ్రెస్ గ్యారెంటీ హామీల పట్ల కేరళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంకా పార్టీ పేరు అధికారికంగా ప్రకటించని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చిన ఎన్నికల హామీలు రైతు రుణ మాఫీ, ఉద్యోగ కల్పన వంటివి ఇంకా నెరవేర్చలేదని కవిత ఆరోపించారు. కేరళంను కాంగ్రెస్ గ్యారంటీల బాధిత రాష్ట్రంగా మారనీయవద్దని, ఆ రాష్ట్ర అభివృద్ధి పయనాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి సీఎం పినరయి విజయన్ నాయకత్వమే అవసరమని అని కవిత స్పష్టం చేశారు.
కేరళ ఓటర్లు అంతా కూడా లెఫ్ట్ పార్టీకే ఓటు వేయాలని, మరోసారి విజయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కవిత.. తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అసలు పినరయి విజయన్కు కవిత ఎందుకు మద్దతిచ్చారన్నది తెలంగాణ రాజకీయ శ్రేణులకు అంతుపట్టకుండా తయారైంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్న తరుణంలో, కవిత ఆయన వైఫల్యాలను ఎండగడుతూ కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పరిస్థితిని వివరిస్తూ ఆమె చేస్తున్న విమర్శలు హాట్ టాపిక్గా మారాయి. అయితే కేరళ లెఫ్ట్ పార్టీ వాళ్లే కవితను సంప్రదించారని, వాళ్ల అభ్యర్థన మేరకే కవిత ఈ వీడియోను విడుదల చేశారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో సొంత పార్టీ పెట్టి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న కవిత.. ఢిల్లీలో తనకు మద్దతు ఉండాలి కాబట్టి.. కేరళ లెఫ్ట్ పార్టీకి ఇప్పుడు మద్దతు ఇస్తున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ను రాజకీయ పార్టీగా మార్చిన కేసీఆర్ తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. మూడో సారి గెలుపు తనదే అన్న ధీమాతో పార్టీ పేరులో తెలంగాణ తీసేసి, భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూశారు. తీరా చూస్తే తెలంగాణలో ఉన్న అధికారం కూడా ఉడిపోయి, వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో గులాబీబాస్ ప్రజలకు ముఖం చూపించడమే మానేసి, ఫాంహౌస్కే పరిమితమయ్యారు. ఇప్పుడు తండ్రి బాటలోనే పార్టీ పెడతానంటున్న కవిత, ఇంకా అది కార్యరూపం దాల్చకుండానే పొరుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పిలుపు నిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Also Read: కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు.. ఓ కోటగాడు.. ఓ కోడికథ..!
Story by: Apparao, Big Tv