Pasha Quadri: హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎంఐఎం (AIMIM) సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మృతి మజ్లిస్ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన పార్థివ దేహాన్ని నివాళులర్పించేందుకు పాతబస్తీలోని ఆయన నివాసానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.
పాషా ఖాద్రీ రాజకీయ ప్రస్థానం ఎంతో విశిష్టమైనది. ఆయన మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు సేవలందించారు. ఇందులో మూడు పర్యాయాలు చార్మినార్ నియోజకవర్గం నుండి, ఒకసారి యాకుత్పుర నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. మజ్లిస్ పార్టీ వ్యవస్థాపకులు, దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి అత్యంత ఆప్తుడిగా, నమ్మకస్థుడిగా ఆయనకు పేరుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీ బలోపేతానికి ఆయన ఎనలేని కృషి చేశారు.
ఖారీ మృతి పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయిందని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర పార్టీల నేతలు కూడా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం పాతబస్తీలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: మణిపూర్లో ముగిసిన రాష్ట్రపతి పాలన.. నూతన ముఖ్యమంత్రిగా యమ్నం కెంచంద్!