Chit Fraud: పరిచయం ఉన్నవారే కదా అని నమ్మి చిట్టీల రూపంలో కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకున్నారు. చివరికి కోట్లతో పరారై ఊహించని షాక్ ఇచ్చారు ఓ దంపతులు. రూ. 2 కోట్లతో పరారైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అమీన్పూర్ పరిధిలోని బీఎస్ఆర్ కాలనీలో శిరీష, సాంబశివరావు అనే దంపతులు నివాసముంటున్నారు. స్థానికులతో సన్నిహితంగా ఉంటూ వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. పలువురి వద్ద నుంచి చిట్టీల పేరిట భారీగా డబ్బులు వసూలు చేశారు. నెలనెలా క్రమం తప్పకుండా వాయిదాలు కట్టించుకున్నారు. తీరా చిట్టీల గడువు ముగిసిన తర్వాత బాధితులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు.
డబ్బుల కోసం బాధితుల నుంచి ఒత్తిడి ఎక్కువ అయ్యింది. దాంతో ఆ దంపతులు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎవరికీ కనిపించకుండా పరారయ్యారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారైన దంపతులను ముమ్మారం గాలిస్తున్నారు.
Also Read: గ్యాస్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. కాపాడిన 108 సిబ్బంది!