మొన్ననే ఓ మాటన్నాడు కేటీఆర్. తప్పుడు ప్రచారాలు చేసి, సోషల్ మీడియాను వాడుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని. మేము కూడా అదే ఫాలో అవుతున్నామని కూడా ప్రకటించుకున్నాడు బాజాప్తా. మెయిన్ మీడియా వేస్ట్ అన్నాడు. దాన్ని అసలు ఎవరు పట్టించుకున్నారన్న రామన్న… అసలు అది జర్నలిజమేనా? అందులో పనిచేసే వాళ్లు జర్నలిస్టులేనా? అని వారిని గంజిలో ఈగ కన్నా అధ్వాన్నంగా తీసి అవతల పాడేసినంత పని చేశాడు.
ఇవాళ ప్రెస్మీట్లో దీన్నే అనుసరిస్తున్నాడనే విధంగా సాగింది ఆయన ధోరణి. ఖమ్మంలో ఓ విద్యార్థి నోట్ రాసి సూసైడ్ యత్నానికి పాల్పడ్డాడు. అందులో కాంగ్రెస్ హామీలు, ఖాళీలు, నోటిఫికేషన్లు.. ఇవన్నీ ప్రస్తావించాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయ్యింది కేటీఆర్కు. ప్రెస్ మీట్ పెట్టాడు. మొదలు మొదాలే.. నిరుద్యోగులను సీఎం ఎండ్రిన్ తాగమని అంటున్నాడు.. అని మొదలు పెట్టాడు. ఈ మాట చాలాసార్లే అన్నాడు కూడా.
ఎవరైనా .. ఎక్కడైనా సీఎం నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చావండి..! అని అంటాడా? ఓ కొంచెం బుద్దున్నోడైనా దీన్ని ఒప్పుకోడు. సీఎం సీట్లో ఉండి.. మీరు చావండిరా బై.. నాకేందీ? అని అనడు. అంత దాకా పోతే.. పరిస్థితి చేయి దాటిందన్నట్టే. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. సీఎం రేవంత్ అన్నది నిరుద్యోగులను కాదు. మరి ఎవరిని అన్నాడు..? ఎందుకు అన్నాడు..? అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? ఏ సందర్భంలో వచ్చింది? ఇప్పుడు దీని గురించే మన టాపిక్.
ఓ సభలో ప్రసంగిస్తూ ఉద్యోగాలు, ఖాళీల భర్తీ, నోటిఫికేషన్ల అంశం గురించి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడాడు. ఆ వేదిక
మీద ఆయన అన్న మాటలేమిటంటే… ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు రోడ్లెక్కేవి.. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తామంటే రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది..అని అన్నాడు. ఇది పోలీస్ పోస్టులను ఉద్దేశించి ఆయన అన్న మాటలు.
7వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ రెడీ అయ్యింది. అయితే ఇవి చాలవు.. 20 వేల పోస్టులు భర్తీ చేయాలనే డిమాండ్ నిరుద్యోగులు, ఉద్యోగార్థుల నుంచి వచ్చింది. దీనిపై పలుమార్లు దిల్సుఖ్నగర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రతిపక్షాలు కూడా వీరితో గొంతు కలిపాయి. అయితే సీఎం దీన్ని ఉద్దేశించి.. కేటీఆర్ను, బీఆరెస్ పాలనను ఉటంకిస్తూ.. ఆ పదేళ్లలో పట్టించుకోనోళ్లు.. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, దీన్ని రాజకీయంగా వాడుకుందామని చూస్తున్నారని, కానీ వారు ఎండ్రిన్ తాగినా.. మేము ఆగమని, ఉద్యోగాల భర్తీ కొనసాగుతూనే ఉంటుందని అన్నాడు.
ప్రతిపక్షం అడ్డుకున్నా.. వెనక్కి తగ్గమని చెప్పడం ఇక్కడ సీఎం ఉద్దేశ్యం. అదీ కేటీఆర్ను ఉద్దేశించే ఆయన ఈ మాటలన్నది. సరూర్నగర్లో బీఆరెస్ యువ సంగ్రామ సదస్సు పెట్టిన రోజే దీనికీ కౌంటర్ ఇచ్చాడు రేవంత్. కేటీఆర్ మాయ మాటలు ఎవరూ వినొద్దనీ, ఖాళీ ఉన్న ప్రతీ ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేసే పూచీ నాదని, తనపై భారం వేసి భరోసాగా ఉండాలని కూడా నిరుద్యోగులను ఆయన కోరాడు.
అయితే ఈ ఎండ్రిన్ తాగి చచ్చినా.. అనే పదాన్ని దొరకబట్టుకున్నాడు కేటీఆర్. ఉద్యోగాలడిగిన నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చావమంటున్నాడు.. అని ఇగ ప్రచారం షురూ చేసిండు. అదన్నమాట సంగతి!