Tribal Rehabilitation: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని గిరిజన గ్రామాల్లోని కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి దశలో 4 గ్రామాలకు చెందిన మొత్తం 417 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో 14 మంది గిరిజన కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అమ్రాబాద్ అడవుల్లో శతాబ్దాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్న గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇది సాధారణ పరిపాలనా నిర్ణయం కాదని, చారిత్రాత్మక సామాజిక–పర్యావరణ సంస్కరణం అని పేర్కొన్నారు. గిరిజన కుటుంబాలను స్వచ్ఛందంగా పునరావాసం కల్పించడంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పులులు సహా వన్యప్రాణులకు సహజ ఆవాసాలు తిరిగి లభిస్తాయన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ 160 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల నగదు పరిహారం, 257 కుటుంబాలకు నాగర్కర్నూల్ జిల్లా బచారం వద్ద ఆధునిక గృహ వసతితో పాటుగా 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నామని వివరించారు. సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాలపెంట, కొల్లంపెంట గ్రామాలకు చెందిన కుటుంబాల అభివృద్ధికి మొత్తం రూ.62.55 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రూ.24 కోట్లు నగదు పరిహారం కోసం, రూ.38.55 కోట్లు గృహ వసతి కోసం వినియోగిస్తున్నామన్నారు. బచారం వద్ద ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 1501 హెక్టార్ల అటవీ భూమి పునరుద్ధరించబడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. పులులు సహా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. పులుల సంఖ్య పెంపునకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని అన్ని మౌలిక వసతులతో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీ కృష్ణా, రాజేష్ రెడ్డి, పీసీసీఎఫ్( వైల్డ్ లైఫ్) వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jio Cheapest Plans: రోజుకు 3GB డేటా.. కేవలం రూ.39 మాత్రమే.. జియో సూపర్ చీప్ ప్లాన్స్!