తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తాడు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈ వారం కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల పాటు ఎండల తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తాయి. పగటి పూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
సాయంత్రం వేళల్లో వాతావరణం అనూహ్యంగా మారిపోతుంది. ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలులు బలంగా వీచే ప్రమాదం ఉంది. ప్రజలు తమ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
రేపు ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. కోనసీమ, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలోని శ్రీసత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కోతకొచ్చిన పంటలను భద్రపరుచుకోవాలి. ఉరుములు మెరుపులు ప్రారంభమైనప్పుడు పొలాల్లో పనిచేసేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రాణాంతకం కావచ్చు. విద్యుత్ స్తంభాలకు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా నిలబడాలి. పశువుల కాపరులు తమ జీవాలను సురక్షితమైన షెడ్లలో ఉంచాలి. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు పాటించడం ద్వారా నష్టాలను నివారించవచ్చు.
ALSO READ: CM Revanth Reddy: హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం.. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి