Auto Protest: హైదరాబాద్: నగర జీవనవాహినిలో కీలకమైన ఆటో రిక్షాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా నగరంలో కొనసాగుతున్న LPG కొరత ఆటో డ్రైవర్ల సహనాన్ని పరీక్షించింది. గంటల తరబడి బంకుల వద్ద వేచి చూసినా గ్యాస్ దొరకకపోవడంతో ఆగ్రహించిన డ్రైవర్లు, బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ నిరసన చేపట్టారు. తమ ఆటోలను ప్రధాన రహదారిపై అడ్డంగా నిలిపివేసి ప్రభుత్వానికి, గ్యాస్ సరఫరా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ట్రాఫిక్ పద్మవ్యూహం..
ఈ ఆకస్మిక ధర్నాతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి ఒక్కసారిగా స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ బస్సులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయాయి. గ్యాస్ దొరక్కపోతే తమ పొట్ట ఎలా గడుస్తుందని, రోజుకు కనీసం రూ.500 కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు.
కొరతకు అసలు కారణమేంటి?
నగరంలోని మెజారిటీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లలో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సరఫరా గొలుసులో తలెత్తిన లోపాలు, ప్లాంట్ల నుండి లోడింగ్ తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో కృత్రిమ కొరత సృష్టించబడుతుందనే అనుమానాలను కూడా డ్రైవర్లు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కుటుంబాలు గడవని పరిస్థితి..
“ఉదయం 4 గంటల నుంచి బంకుల దగ్గర క్యూ కడుతున్నాం, తీరా మా వంతు వచ్చేసరికి గ్యాస్ అయిపోయిందని బోర్డు పెడుతున్నారు” అని ఒక డ్రైవర్ కన్నీరు పెట్టుకున్నారు. రోజువారీ కిరాయిలు చెల్లించి, గ్యాస్ కోసం తిరుగుతూ సమయమంతా రోడ్ల మీదనే గడిచిపోతోందని, ఇంట్లో పిల్లల చదువులు, తిండికి కూడా పైసలు మిగలడం లేదని వారు వాపోతున్నారు. ఆటోల నడకపైనే ఆధారపడ్డ లక్షలాది మంది కుటుంబాలు ఇప్పుడు గ్యాస్ కొరతతో రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
Also Read: మాంసం ప్రియులకు షాక్.. తెలంగాణలో చికెన్ బంద్.. నేటి నుంచి మూతపడనున్న 50 వేల షాపులు!
ప్రభుత్వ జోక్యం అవసరం..
ఈ సంక్షోభం కేవలం ఎల్బీనగర్కే పరిమితం కాకుండా నగరం నలుమూలలా విస్తరిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో మాట్లాడాలని, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరంతరాయంగా గ్యాస్ అందేలా చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో నగరవ్యాప్తంగా ఆటో బంద్ చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. సామాన్యుడి రవాణా భారంగా మారకముందే పాలకులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది.
గ్యాస్ దొరకడం లేదని ఆటో డ్రైవర్లు ఆందోళన
హైదరాబాద్-ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిరసన
LPG గ్యాస్ కొరతను నిరసిస్తూ హైవేపై ఆటోలను అడ్డంగా నిలిపివేసిన డ్రైవర్లు
దీంతో ఆ ప్రాంతంలో భారీగా స్తంభించిన ట్రాఫిక్
Auto drivers protest at Hyderabad-LB Nagar Sagar Ring Road over… pic.twitter.com/BV9iFHN0Ym
— BIG TV Breaking News (@bigtvtelugu) April 1, 2026