Azharuddin: తెలంగాణ కేబినెట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ కు చోటు దక్కింది. ఎల్లుండి అక్టోబర్ 31న మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ లో ఇంతవరకు మైనార్టీ మంత్రిగా ఎవరూ లేని విషయం తెలిసిందే. మైనార్టీ, హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్ మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
మంత్రి వర్గంలో ఇప్పటి వరకు ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపిన విషయం తెలసిందే. దానికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే అజారుద్దీన్ కు హోం లేదా మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హోం శాఖ సీఎం రేవంత్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. అజారుద్దీన్ క్రీడా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, క్రీడా శాఖను కూడా కేటాయించే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి చెందిన మంత్రి లేకపోవడంపై తీవ్ర విమర్శలు, అసంతృప్తి వ్యక్తమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఒక్క మైనార్టీ అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. ముఖ్యంగా.. హైదరాబాద్ నగరానికి చెందిన ప్రాతినిధ్యం కూడా కేబినెట్లో లోపించింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి చెందిన, మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం వహించే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఈ రెండు లోపాలను అధిగమించాలని కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టడం వెనుక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమీకరణాలు కూడా ప్రధానంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ ఈ జూబ్లీహిల్స్ స్థానం నుంచే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఉప ఎన్నికలో కూడా ఆయన టికెట్ ఆశించారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గం ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా.. ఉప ఎన్నిక ప్రచారంలో అజారుద్దీన్ చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అజారుద్దీన్.. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్లోని టోంక్-సవాయ్ మాధోపూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మంత్రివర్గంలోకి చేరడం ద్వారా ఆయన రాజకీయ జీవితంలో ఒక కొత్త ఘట్టం మొదలుకానుంది.
ALSO READ: Cyclone Montha: ఆ జిల్లాలపై మొంథా తుఫాను ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు