DCC Presidents: స్వేచ్ఛ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో ‘బీ-ఫామ్’ల పంపిణీ వ్యవహారం లో వివాదం నెలకొన్నది. కొన్ని మున్సిపాలిటీల్లో బలంగా ఉన్న అభ్యర్థుల కంటే, జేబులు నింపిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని నేరుగా గాంధీభవన్ కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ వ్యవహారంలో కొందరు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు పాత్ర ఉన్నదని ఫిర్యాదులు అందడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లోపించిందని, టికెట్లు ఆశించిన ఆశావహుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారని పార్టీ అధిష్ఠానానికి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో టీపీసీసీ ఆదేశాల మేరకు ఓ టీమ్ ఇన్విగ్టేషన్ మొదలు పెట్టినట్లు తెలిసింది. రహస్యంగా ఎంక్వైయిరీ చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పార్టీపై విమర్శలు చేస్తూ కొందరు అభ్యర్ధులు గతంలోనే బహిరంగంగానే విమర్శించారు. తాజాగా నేరుగా కంప్లైంట్స్ ఇవ్వడంతో టీపీసీసీ సీరియస్ గా తీసుకున్నది.
కొందరు జిల్లా అధ్యక్షులు తమకు అనుకూలమైన వారికే బీ-ఫామ్లు కేటాయించారని, ఇందులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సొంత పార్టీ నేతలే గొంతు విప్పుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పక్కన పెట్టి, చివరి నిమిషంలో ‘బలమైన ఆర్థిక అండదండలు’ ఉన్న వారికే బీ-ఫామ్లు కట్టబెట్టారని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు సర్పంచ్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో సర్వే విధానంలోనే టిక్కెట్లు పంపిణీ జరిగిందనే చర్చ ఉన్నది. ఫలితాలు కూడా పార్టీ ఆశించిన స్థాయిలోనే వచ్చాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సర్వేలు నిర్వహించినప్పటికీ, కొందరు డీసీసీలు అత్యుత్సాహంతో టిక్కెట్ల పంపిణీలో గోల్ మాల్ చేశారనే చర్చ ఉన్నది.వరుసగా వస్తున్న ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చీఫ్ అత్యంత సీరియస్గా తీసుకున్నారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి పనులను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Kalvakuntla Kavitha: ప్లాన్ ప్రకారం కవిత అడుగులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు
“మున్సిపల్ ఎన్నికలు పార్టీకి ప్రతిష్టాత్మకం. ఇందులో అక్రమాలకు చోటు లేదు. ఫిర్యాదులు వచ్చిన జిల్లాలపై అంతర్గత విచారణకు ఆదేశించాం”అంటూ గాంధీభవన్ కు చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న డీసీసీల పనితీరుపై పీసీసీ ఒక కమిటీని వేయాలని నిర్ణయించింది.అంతేగాక ఎవరైనా అభ్యర్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలని గాంధీభవన్ వర్గాలు సూచించాయి. తొలుత ప్రాథమిక ఎంక్వైయిరీ, ఆ తర్వాత ప్రత్యేక కమిటీ విచారిస్తుంది. ఆ తర్వాత అక్రమాలు రుజువైతే సదరు నేతలను పదవుల నుంచి తొలగించడమే కాకుండా, క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధిష్ఠానం సిద్ధమవుతోంది.నిజాయితీ గల కార్యకర్తలకు అన్యాయం జరిగితే, అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే టీపీసీసీ బీ ఫామ్ ల పంపిణీ ఇష్యూను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ముందుకు వెళ్తున్నది.