Bandi Sanjay: తెలంగాణ బడ్జెట్ అంతా డొల్ల.. ఇది ఎలక్షన్ స్టంట్.. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్ను రూపొందించారంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండి చేయి చూపేలా బడ్జెట్ ఉందన్నారు. కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదన్నారు బండి సంజయ్.
ప్రతిపాదిత బడ్జెట్లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. ‘మాటలు కోటలు దాటుతున్నయ్.. చేతలు గడప దాటడం లేదు’ అనే సామెత అద్దం పడుతోందన్నారు. యావత్ దళిత సమాజాన్ని మోసం చేసేదిగా బడ్జెట్ ఉందన్నారు. ఈసారి కూడా బీసీ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కు కాబోతున్నట్లు అర్థమవుతుందని మండిపడ్డారు.
డిస్కంలను మరింత సంక్షోభంలో నెట్టేలా కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి చెల్లిస్తున్న రూ.2.63 లక్షల సొమ్మును తన ఖాతాలో వేసుకోవడానికి బడ్జెట్లో నిధులను చూపినట్లు అర్థమవుతోందన్నారు.
రూ.2,90,396 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ.1.31 లక్షల కోట్లుగానే చూపిందని.. మిగిలిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్. కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూపేణా ఈ బడ్జెట్లో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోందని.. ఇవిపోగా మిగిలిన ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం మద్యం, భూముల అమ్మకంతోపాటు అప్పుల ద్వారా, ప్రజలపై భారం మోపడం ద్వారా మాత్రమే సమకూర్చుకునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ డొల్ల బడ్జెట్ను బీజేపీ పక్షాన ప్రజల్లో ఎండగడతామన్నారు బండి సంజయ్.