Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: వలస వెళ్లేందుకు తాను అవకాశవాదిని కాదని, రేవంత్ రెడ్డిని అంతకంటే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక వీడియో ద్వారా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తాను చచ్చినా బతికినా బీజేపీలోనే ఉంటానని స్పష్టంచేశారు. తాను చనిపోతే తన శవంపై కప్పేది కాషాయ జెండానేనన్నారు. ఆ సన్నివేశం చూడటానికైనా రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరారు. తాను చచ్చినా, బతికినా, ఓడినా, గెలిచినా తన కేరాఫ్ అడ్రస్ కరీంనగరేనని తేల్చారు. తన రక్తంలోనే జాతీయవాదమనే డీఎన్ఏ ఉందన్నారు. వలసవాది, అవకాశవాదానికి ప్రతిరూపం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పాలమూరు నుంచి మల్కాజిగిరి దాకా వలస పోయింది రేవంత్ రెడ్డేనని చురకలంటించారు.
మహిళా బిల్లును వ్యతిరేకించే కాంగ్రెస్ కూడా బీజేపీని విమర్శించడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ నిజంగా మహిళా రిజర్వేషన్లకు సానుకూలమైతే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రంలో దాదాపు 30 ఏళ్లకుపైగా కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. కనీసం కాంగ్రెస్ లోనైనా సంస్థాగతంగా ఏనాడైనా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేశారా? అని బండి ప్రశ్నల వర్షం కురిపించారు. కేబినెట్లో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారని నిలదీశారు. రాజకీయాల్లో సంస్థాగతంగా మహిళలకు 33 శాతం పదవులు ఇస్తున్న ఘనత బీజేపీదేనని బండి పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్లో అత్యధిక మంది మహిళలకు అవకాశం కల్పించిన ఘనత మోడీది కాదా? అని ప్రశ్నించారు.
50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి జరిగే నష్టమేంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించి విభజించాలనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ చెప్పే శాస్త్రీయత ఏంటని, డబ్బు సమకూర్చే వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారా? అని విమర్శించారు. డబ్బుకు, ఓటుకు, సీటుకు లింకుపెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్ష కోట్లు ఉన్న కాంగ్రెస్ కుటుంబానికి లక్ష ఓట్లు ఇవ్వాలా? అని ఆరోపించారు. డబ్బులేని పేదవాడికి ఓటు హక్కు కల్పించొద్దా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ లెక్క ప్రకారం.. ముంబై, ఢిల్లీకి మాత్రమే అత్యధిక సీట్లు ఉండాలా? అని ప్రశ్నించారు. వెనుకబడ్డ ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: ఎన్నికల్లో బయో మెట్రిక్.. సుప్రీం కోర్టులో పిటిషన్.. సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు!
కాంగ్రెస్ పార్టీ రేవంత్ ను మనీ మనిషిగా మార్చిందా? లేక మర మనిషిగా మార్చిందా? అని ప్రశ్నించారు. సీఎంలో ఏమాత్రం మానవత్వం ఉన్నా.. నిజం మాట్లాడాలన్నారు. ప్రతీది రాజకీయం చేయడం తప్ప మనిషిగా ఆలోచించే తత్వమే సీఎంకు లేదని ఫైరయ్యారు. విభజన అనేది కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉన్నట్టు ఉందని బండి ఎద్దేవాచేశారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే నష్టమేంటని బండి ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేయాలని చెబుతున్నారా? అంటూ ఫైరయ్యారు. యూపీఏ సర్కార్ చెప్పిన ఏపీ పునర్విభజన యాక్ట్ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు మాత్రమే పరిమితం చేయాలా అని వ్యాఖ్యానించారు.
హైకమాండ్ కు మూటలు పంపే టెన్షన్ లో తెలిసి కూడా తెలియనట్లు ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే భయం కేసీఆర్ తోపాటు రేవంత్కు కూడా ఉందా? అని బండి ఎద్దేవాచేశారు. అందుకే కేసీఆర్ బాటలో నడుస్తున్నారేమోనని చురకలంటించారు. కేసీఆర్కు, రేవంత్కు తేడా లేదని తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ లాగే అడ్డగోలు హామీలిస్తున్నారని, కేసీఆర్ లాగే పచ్చి బూతులు మాట్లాడుతున్నారని, కేసీఆర్ లాగే ప్రశ్నించే వాళ్లను సమాధి చేయాలని చూస్తున్నారంటూ బండి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కేసీఆర్ నీడ నుంచి బయటకు వచ్చి నిజాలు మాట్లాడాలని బండి సంజయ్ సూచించారు.
Also Read: నారీ శక్తిపై నీచ రాజకీయాలు వద్దు.. ప్రభుత్వంపై ఎంపీ లక్షణ్ ఫైర్!