Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ బడ్జెట్ను ‘మోసం, దగా, ప్రజా వంచన’ బడ్జెట్గా అభివర్ణించారు. అంకెల ఆర్బాటాలు, ప్రగల్భాలు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పక్కనబెట్టి కేవలం అప్పుల కోసమే అర్రులు చాచే విధంగా ఈ బడ్జెట్ ఉందని.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టిందని మండిపడ్డారు.
బడ్జెట్లో విద్యా, వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. విద్యాశాఖకు 16 శాతం నిధులు కేటాయించాలని కమిషన్ ప్రతిపాదించినప్పటికీ కేవలం 8 శాతానికే పరిమితం చేయడం దారుణమన్నారు. విద్యా కమిషన్ను పట్టించుకోలేదని.. ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్యాశాఖకే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో దేవాదాయ శాఖకు రూ.190 కోట్లు ఇస్తే.. ఈసారి ఆ ప్రస్తావనే లేదని.. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కంటితుడుపు కేటాయింపులు చేశారని మండిపడ్డారు.
రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోందని సంజయ్ విమర్శించారు. ఆరు వాయిదాలకు గానూ కేవలం రెండు మాత్రమే ఇచ్చి.. మిగిలినవి ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15,000 ఏవని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, తులం బంగారం, రూ.4,000 పెన్షన్ పెంపు వంటి ఆరు గ్యారంటీల ఊసే లేదని.. వీటికి ఈ బడ్జెట్తో పాడె కట్టారని ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల భరోసా కార్డులకు రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 4 శాతం నిధులు ఇవ్వడం సామాజిక అన్యాయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిందని.. ఇప్పుడు మరో లక్ష కోట్లు తెచ్చేందుకు సిద్ధమవుతోందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ అప్పులు రూ.12 లక్షల కోట్లకు చేరితే రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని హెచ్చరించారు. దావోస్, గ్లోబల్ సమ్మిట్ పేరుతో ముఖ్యమంత్రి ‘గాడిద గుడ్డు’ పట్టుకొచ్చారని.. తెచ్చిన పెట్టుబడుల వివరాలు వెల్లడించే దమ్ముందా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గం చూపకుండా.. రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు.
డ్రగ్స్ కేసు విచారణలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని.. అకుల్ సబర్వాల్ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదని సంజయ్ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభాకర్ రావు కుటుంబాలను నాశనం చేశారని.. ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ రావడానికి ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. కాళేశ్వరం విచారణ ఏమైందని.. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని.. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం లేకపోతే చెప్పాలని.. తాము బీజేపీ అధికారంలోకి వచ్చాక అందరినీ అరెస్ట్ చేసి చూపుతామని సవాల్ విసిరారు.