Basti Dawakhana: స్వేచ్ఛ బ్యూరో: పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తూ, ఇంటి ముంగిటకే వైద్య సేవలను చేరవేస్తున్న ‘బస్తీ దవాఖానాలు’ అద్భుతమైన పురోగతిని సాధిస్తున్నాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, ప్రభుత్వ వైద్యంపై సామాన్య ప్రజలకు నమ్మకం ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టమవుతోంది. 2021 నుండి 2026 వరకు ఈ దవాఖానాల పనితీరుపై ప్రభుత్వం డేటా ఆధారంగా విశ్లేషించింది. రాష్ట్ర వ్యాప్తంగా 475 కేంద్రాలు పనిచేస్తుండగా, ఒక్కో సెంటర్ గా సగటున 50 మంది చొప్పున వైద్యం పొందుతున్నట్లు గుర్తించారు. గతంతో పోల్చితే ఆదరణ పెరగడంతో బస్తీ దవాఖాన్లోని మినీ ల్యాబ్స్, సెంటర్ల మరమ్మత్తులకు ప్రభుత్వం చొరవ తీసుకున్నది. సుమారు 372 బస్తీ దవాఖానల్లోని వర్క్స్ ను రిపేర్ చేయాలని నోడల్ ఏజెన్సీకి ఆదేశాలిచ్చింది. అంతేగాక పేషెంట్లకు ఇబ్బందులు కాకుండా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి నేరుగా బస్తీ దవాఖానల్లోకే మందులు సప్లై అయ్యేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది.
బస్తీ దవాఖానాల్లో రోగుల తాకిడి ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8,93,444 గా ఉన్న రోగుల సంఖ్య, 2025-26 నాటికి ఏకంగా 82,28,840 కు చేరుకుంది.అంటే గత ఐదేళ్లలో రోగుల సంఖ్య దాదాపు తొమ్మిది రెట్లు పెరగడం గమనార్హం. సగటున ప్రతి రోజూ ఒక్కో ఫెసిలిటీలో రోగుల సంఖ్య 11 నుండి 58కి పెరిగింది. దీనివలన ప్రాథమిక, అర్బన్ పీహెచ్ సీలకు పేషెంట్ల తాకిడి తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే క్షేత్రస్థాయిలోనే పేషెంట్లకు సకాలంలో వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
Also Read: డబ్బుల కోసం వెళ్తే.. ప్రాణాలనే తీసిన ఏటీఎం డోర్.. హైదరాబాద్లో విషాద ఘటన
కేవలం డాక్టర్ కన్సల్టేషన్లే కే పరిమితం కాకుండా, మందుల పంపిణీ తో పాటు పరీక్షల నిర్వహణలోనూ ఈ దవాఖానాలు ముందంజలో ఉన్నాయి.2025-26లో దాదాపు 78.75 లక్షల మంది రోగులు ఉచితంగా మందులు పొందారు. అంటే చికిత్సకు వచ్చిన వారిలో 95 శాతం పైగా రోగులకు అక్కడే మందులు అందుతున్నాయి. ఇక వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2021లో 56,898 గా ఉన్న టెస్టుల సంఖ్య, ప్రస్తుతం 6.27 లక్షలకు చేరింది. దీనివల్ల నిరుపేదలకు ప్రైవేట్ ల్యాబ్ల ఖర్చు తప్పింది.అంతేగాక ఆధునిక సాంకేతికతను జోడించి అందిస్తున్న ‘టెలీ-కన్సల్టేషన్’సేవలు కూడా ప్రజలకు చేరువయ్యాయి.2021లో కేవలం 1,687 గా ఉన్న ఈ సేవల వినియోగం, 2024-25లో గరిష్టంగా 1.05 లక్షలకు చేరింది. నిపుణులైన వైద్యుల సలహాలను స్థానిక దవాఖానా నుంచే పొందడం రోగులకు వరంలా మారింది.ఇది ప్రభుత్వ ఆసుపత్రులపై పెరుగుతున్న ఈ నమ్మకమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాదిగా మారుతోందని వైద్యాధికారులు చెప్తున్నారు.
Also Read: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండ.. రూ. 10 లక్షల పరిహారం, ఉద్యోగ హామీ!