Bhatti Vikramarka: పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి నేతలను భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు విద్యలింగం తో కలిసి పుదుచ్చేరి లోని మనవేలి అసెంబ్లీ నియోజకవర్గం లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పుదుచ్చేరి ఓటర్లకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, డీఎంకే కూటమి.. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని భట్టి అన్నారు. తమపై ఎన్ డీఏ చేస్తున్న అసత్యాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించారు. పుదుచ్చేరి బంగారు భవిష్యత్తుకు యూడీఎఫ్ కూటమి గెలుపే మార్గమని అన్నారు. తాము ఇచ్చిన గ్యారంటీలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని వివరించారు. . 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని కూడా పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
Also Read: ఇన్ఫ్రారెడ్ స్టవ్పై.. స్లో కుకింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!
మహిళలను బస్సుల యజమానులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాబట్టి పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమిని గెలిపిస్తే.. తెలంగాణ తరహాలో సంక్షేమ పాలన లభిస్తుందని హామీ ఇచ్చారు.
Also Read: యాపిల్ బంపరాఫర్.. iPhone 17 Pro Maxపై.. ఏకంగా రూ.47,000 తగ్గింపు!